ప్రజారక్షణకు భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం పోలీసుశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని, శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని సురక్షా దినోత్సవ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్రెడ్డి, క్రాంతికిరణ్, మాణిక్రావు, భూపాల్రెడ్డితో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పోలీసు వ్యవస్థను పటిష్టపరచడంతో నేరాల సంఖ్య బాగా తగ్గిపోయిందని అన్నారు. కొత్త పోలీస్స్టేషన్లు, పెట్రోలింగ్ వాహనాలు మంజూరు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారని, హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో జరిగిన నేరాలను సైతం గుర్తించి గంటల వ్యవధిలోనే ఛేదిస్తున్నారని అభినందించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. సురక్షా దివస్లో భాగంగా పలుచోట్ల యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఎమ్మెల్యేలు దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేసి వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 4: రక్తదానం చేసి ప్రాణాలు కాపాడటానికి ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సురక్షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ అనే నినాదంతో కార్యమాలు నిర్వహించారు. స్థానిక పోలీసు కల్యాణ మండపంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సిబ్బంది, పట్టణ యువత రక్తదానం చేశారు. అనంతరం స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సురక్షా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు అధికారులు, సిబ్బంది, పట్టణ యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారన్నారు. మొత్తం 52 యూనిట్ల రక్తం సేకరించినట్లు తెలిపారు. ఆరోగ్యంగా ఉండే ప్రతిఒక్కరు రక్తదానం చేయవచ్చన్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నాలుగు సబ్ డివిజన్లలో మొత్తం 291 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో 300 మంది రోగులకు పండ్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. శిబిరంలో రక్తదానం చేసిన ప్రతిఒక్కరికి పోలీస్ శాఖ తరఫున అభినందనలు తెలుపుతూ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉషా విశ్వనాథ్, డీఎస్పీ రవీంద్రారెడ్డి, డాక్టర్ జ్యోతి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, డీఎస్పీ భీంరెడ్డి ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవాన్ని నిర్వహించారు. నారాయణఖేడ్ ఏరియా దవాఖానలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. జహీరాబాద్లో ని వాసవి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సురక్షా దినోత్సవంలో ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అందోల్ నియోజకవర్గంలోని జోగిపేటలో పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పాల్గొని, రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. మహిళల రక్షణకోసం షీ టీంలు, రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండడంతో నేరాల సంఖ్య తగ్గిందన్నారు.