రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని, ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్, బీజేపీలు ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. మునిపల్లి మండలం కంకోల్లో సోమవారం బీఆర్ఎస్ మండల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రైతులు పండుగలా వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. కాళేశ్వరం జలాలతో బీడుభూములు పంటపొలాలుగా మారాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకున్నా రాష్ట్ర సర్కారు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని, డబ్బులు ఎప్పటికప్పుడు ఖాతాల్లో జమ చేస్తున్నదని తెలిపారు. జాతీయ స్థాయి ఉత్తమ పంచాయతీ అవార్డుల్లో ప్రథమ స్థానం కైవసం చేసుకోవడం తెలంగాణ పల్లెలు సాధించిన అభివృద్ధికి నిదర్శనమన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వందకుపైగా సీట్లు గెలవడం ఖాయమన్నారు. రాష్ట్రంతో పాటు దేశంలోనూ సంక్షేమపాలన అందించేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేశారన్నారు. సమ్మేళనానికి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరవగా, డీజే, డప్పుచప్పుళ్లు, బ్యాండుమేళాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
మునిపల్లి, మే 22: తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతుంటే జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మండిపడ్డారు. ఉనికిని కాపాడుకోవడానికే కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు. మునిపల్లి మండలం కంకోల్ గ్రామంలోని అభిషేక్ గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ మునిపల్లి మండల ఆత్మీయ సమ్మేళనం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిచారు. రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ఎడారిగా మారుతుందన్నవారి నోళ్లు మూతపడేలా కాళేశ్వర జలాలు బీడు భూములకు తరలించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రైతాంగం సంతోషంగా వ్యవసాయం చేసుకుంటుందన్నని చెప్పారు. రాష్ట్రంలో పండించిన ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించినా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందన్నారు. ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు తెలంగాణ పథకాలను కాపీ కొట్టడం సిగ్గు చేటు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన ప్రతిష్టాత్మక ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు పదింటిని రాష్ట్రం కైవసం చేసుకోవడమే తెలంగాణ పల్లెలు సాధించిన అభివృద్ధికి నిదర్శనమన్నారు.
Medak1
మునుపెన్నడూ లేనివిధంగా మునిపల్లి అభివృద్ధి…
మునుపెన్నడూ లేనివిధంగా మునిపల్లి అభివృద్ధి చెందిందని, మండలంలోని ప్రతి గ్రామంలో సుమారు రూ.60 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు గ్రామాల అభివృద్ధి కన్నా వారి ఆస్తులు పెంచుకున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు అభివృద్ధి, సంక్షేమంపై ఒక ప్రశ్న వేస్తే వారికి 10 జవాబులు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ ఫలాలను ప్రజలకు వివరిస్తూ పార్టీపై మరింత ఆదరణ పెరిగేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ వందకు పైగా స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తుందని ధీమాగా చెప్పారు. సీఎం కేసీఆర్ ముందుచూపు ఉన్న ప్రజ్ఞాశాలి అని, రాష్ట్రం అభివృద్ధి చెందితే సరిపోదని దేశ రాజకీయాల్లో క్రియాశీలంగా మారాలన్న సంకల్పంతో బీఆర్ఎస్ స్థాపించారని తెలిపారు. తమ పార్టీ దేశంలో అధికంగా ఎంపీ సీట్లు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అభివృద్ధిని అడ్డుకుంటున్నది దామోదర రాజనర్సింహే…
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో మునిపల్లి మండలంలోని లింగంపల్లి శివారులో నూతనంగా నిర్మాణం చేపడుతున్న ఫుడ్ ఫ్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులు జరుగకుండా అడ్డుకుంటూ దొంగ సంతకాలతో కేసులు వేసి పనులు అడ్డుకుంటున్నది మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహనే అని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తూర్పారబట్టారు. గతంలో అందోల్ నియోజకవర్గంలోని సుల్తాన్పూర్లో కట్టిన జేఎన్టీయూ, వట్పల్లిలో చేపట్టిన మార్కెట్ యార్డ్ నిర్మాణ పనుల్లో భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం అందించడం చేతకాని నాయకుడు దామోదార రాజనర్సింహ అని ఎద్దేవా చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణంలో భూములు కోల్పుతున్న రైతులకు తమ ప్రభుత్వం ఎకరాకు రూ.15 లక్షల చొప్పున పరిహారం అందిస్తోందని తెలిపారు.
భారీగా తరలివచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులు
కంకోల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మునిపల్లి మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరు కావడంతో కంకోల్ కూడళ్లన్నీ గులాబీమయమయ్యాయి. డప్పూదరువులు, బ్యాండ్ మేళాలు, డీజే చప్పుళ్ల మధ్య ర్యాలీ ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. ఎమ్మెల్యే క్రాంతికిరణ్తోపాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జైపాల్రెడ్డి, భిక్షపతి, సాయికుమార్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శశికుమార్ ప్రత్యేక వాహనం నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కార్యక్రమంలో ఎంపీపీ శైలజాశివశంకర్, జడ్పీటీసీ మీనాక్షీసాయికుమార్, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.