సంగారెడ్డి, మే 24(నమస్తే తెలంగాణ): ‘ఎక్కడి ధాన్యం అక్కడే’ శీర్షికతో నమస్తే తెలంగాణలో శుక్రవారం ప్రచురితమైన కథనం అధికార యంత్రాంగంలో కదలికను తీసుకొచ్చింది. ‘నమస్తే కథనం’పై స్పందించి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా ప్రత్యేకాధికారి భారతి హోళికేరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం సేకరణ పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సిబ్బందిని ఆదేశించారు. జిల్లా ప్రత్యేకాధికారి భారతి హోళికేరి జిన్నారం, గుమ్మదిదలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ధాన్యం సేకరణ తీరును పరిశీలించి ధాన్యం సేకరణ మరింత వేగంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ మాధురి, సివిల్ సప్లయ్ అధికారులకు సూచించారు. సంగారెడ్డి మండలంలోని దాసుగడ్డ తండా కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్, భారతి హోళికేరి సందర్శించారు. ధాన్యం అమ్మేందుకు వచ్చిన రైతులతో మాట్లాడారు. ధాన్యం అమ్మకంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? తరుగు పేరుతో అదనంగా ధాన్యం తీసుకుంటున్నారా? అంటూ అడిగారు.
రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం సేకరించాలని, సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు చేర్చాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కొడూరులోని రైస్మిల్లును కలెక్టర్, భారతి హోళికేరి సందర్శించారు. మిల్లుకు వచ్చిన వాహనాలను వెంటవెంటనే ఖాళీ చేయించి కొనుగోలు కేంద్రాలకు పంపించాలని మిల్లు యాజమాన్యానికి సూచించారు. సాధ్యమైనంత త్వరగా ధాన్యం బస్తాలను దించుకోవాలని ఆదేశించారు. మిల్లులో సార్టెక్స్ మిషన్ పెట్టుకోవాలన్నారు. పుల్కల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ వల్లూరు క్రాంతి సందర్శించారు. అక్కడ రైతులతో మాట్లాడారు. అనంతరం రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణ పూర్తి చేయాలని సూచించారు. ధాన్యం సేకరణలో జాప్యం జరగవద్దని, వాహనాలు, కూలీల కొరత లేకుండా చూడాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. పౌర సరఫరాల శాఖ అధికారులు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం బస్తాలను మిల్లులకు చేర్చే పనులను వేగవంతం చేశారు. ఇందు కోసం అవసరమైన వాహనాలను సమకూర్చారు. మరో ఎనిమిది రైసు మిల్లుల యజమానులను ధాన్యం బస్తాలను దించుకునేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు ఒప్పించారు.
జిన్నారం, మే 24: కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు లారీల్లో మిల్లులకు తరలించాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి భారతి హోళికేరి సిబ్బందికి సూచించారు. శుక్రవారం జిన్నారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంగారెడ్డి జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ మాధురితో కలిసి పరిశీలించారు. జిన్నారం శివారులోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బందితో మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రం వద్ద నిల్వ ఉంచకుండాఎప్పటికప్పుడు లారీల్లో రైస్మిల్లులకు తరలించాలన్నారు. రవాణాలో జాప్యం లేకుండా చూడాలన్నారు. జియోట్యాగింగ్ను పరిశీలించారు. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే ప్రతి గింజనూ కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్వో వనజాత, తహసీల్దార్ భిక్షపతి, వ్యవసాయాధికారి రవీంద్రనాథ్ రెడ్డి, ఐకేపీ ఏపీఎం నరేందర్, వీవో సుజాత, ఏఈవోలు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.