రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కొనసాగుతున్నది. 19వ రోజైన బుధవారం ఉభయ జిల్లాల్లోనూ శిబిరాల్లో వైద్యుల సేవలు కొనసాగాయి. ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో మొత్తం 1,06,634 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, సంగారెడ్డి జిల్లా పరిధిలో ఒక్క రోజే 16,980 మందికి కంటి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి.
– మెదక్/సంగారెడ్డి, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) :
మెదక్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 38 బృందాలు కంటి వెలుగు శిబిరాల్లో పాల్గొనగా, ఇప్పటివరకు 1,06,634 మందికి కంటి పరీక్షలు చేశారు. 13,565 మందికి కండ్లద్దాలు అందజేశారు. 12,803 మందికి అద్దాల కోసం ఆర్డర్లు ఇచ్చారు. బుధవారం 19వ రోజు జిల్లాలో 6374 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 2885 మంది, మహిళలు 3489 మంది ఉన్నారు. 505 మందికి కండ్లద్దాలు అందజేశారు. 553 మందికి అద్దాల కోసం రెఫర్ చేసినట్లు డీఎంహెచ్వో డాక్టర్ చందునాయక్ తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి, ఫిబ్రవరి15: కంటి వెలుగు కార్యక్రమం ప్రజల కండ్ల తేజస్సు పెంచిందని సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. పట్టణంలోని సెయింట్ ఆంథోనీస్ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న కంటి వెలుగు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. జిల్లాలో 16980 మందికి కంటి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరానికి వచ్చే ప్రజలకు అన్ని వసతి కల్పించాలని సూచించారు.