జిన్నారం, ఫిబ్రవరి 7: అతివేగంతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన జిన్నారం మండలంలోని రాళ్లకత్వ గ్రామంలో జరిగింది. స్థానికులు, ప్రయాణికుల కథనం ప్రకారం… మెదక్ జిల్లా నర్సాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం ఉదయం 9:30 ప్రాంతంలో సోలక్పల్లి మీదుగా పటాన్చెరు వెళ్తుండగా రాళ్లకత్వ గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు బలంగా ఢీకొట్టింది. బస్సులో ఉన్న 30 మందిలో ముగ్గురికి తీవ్రంగా, 27మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణం బస్సు అతివేగమేనని గ్రామస్తులు, ప్రయాణికులు తెలిపారు.
బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని పటాన్చెరులోని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చెట్టు ఢీకొన్న సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కాట శ్రీనివాస్గౌడ్, జిన్నారం ఎంపీపీ రవీందర్గౌడ్, వడ్డె కృష్ణ, సోలక్పల్లి మాజీసర్పంచ్ శ్రీకాంత్రెడ్డి దవాఖానకు వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.