హుస్నాబాద్, ఫిబ్రవరి 23: తెలంగాణ ఆర్టీసీని దేశంలోనే నంబర్వన్ సంస్థగా రూపుదిద్దుతామని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి శుక్రవారం ఆయన సందర్శించారు. మేడారం జాతరకు బస్సు సౌకర్యం, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులు, మేడారం జాతర భక్తులతో మాట్లాడి ఆర్టీసీ బస్సుసౌకర్యంపై ఆరా తీశారు. అనంతరం ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డ్రైవర్లకు అల్పాహారం, నీళ్ల బాటిళ్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను విజయవంతం చేయడంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండటం వల్ల మహిళలు పెద్ద సంఖ్యలో మేడారం జాతరకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకుంటున్నారన్నారు. హుస్నాబాద్ ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో భక్తులు మేడారం వెళ్తుంటారని, ఇప్పటి వరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జాతరకు వెళ్లివస్తున్నారని తెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇప్పించడం, డీఏలను ఎప్పటికప్పుడు చెల్లించడం జరుగుతుందన్నారు. పీఆర్సీపై కూడా ప్రభుత్వం చర్చిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా ఆర్టీసీ సంస్థ పనిచేస్తోందని చెప్పారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు భవిష్యత్లో ఆర్టీసీకీ పూర్వ వైభవం తీసుకొచ్చి దేశంలో ప్రత్యేక గుర్తింపు వచ్చేలా కృషి చేస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో ఆర్టీసీకి మరిన్ని బస్సులు తెప్పించేందుకు కూడా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి, హుస్నాబాద్ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఉద్యోగులు, స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.