రామాయంపేట, డిసెంబర్ 2: పొద్దు తిరుగుడు పంట రైతులకు లాభసాటిగా మారింది. తక్కువ పెట్టుబడితో రైతులు ఎక్కువ లాభాలు పొందవచ్చు. గతంలో ఈ పంటను చాలా మంది సాగుచేసేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరి పంట వైపు మళ్లి సన్ఫ్లవర్పై రైతులు ఆసక్తి కనబర్చడంలేదు. యాసంగిలో కూడా ఈ మధ్యలో రైతులు ఎక్కువ శాతం వరి పంటే సాగు చేశారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో కొంతమంది పొద్దుతిరుగుడు, ఇతర పంటల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పొద్దు తిరుగుడు పంట 90 రోజులోన్లే చేతికి వస్తున్నది. అంతర పంటగా కూడా విత్తుకుంటున్నారు. మండలంలో పొద్దుతిరుగుడు పంట సుమారు 160 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. శివ్వాయపల్లికి చెందిన రైతు ముత్యాలు ఎకరంలో పొద్దుతిరుగుడు పంటను విత్తుకున్నాడు. ఎకరానికి రూ.10 వేల ఖర్చు కాగా, పంట స్వల్పకాల వ్యవధి 90రోజులకే పంట చేతికి వస్తుంది. ఈ పంటకు మార్కెట్లోనూ డిమాండ్ పెరిగింది. మార్కెట్లో పంట ఎక్కువగా విత్తుకోనందున క్వింటాలుకు రూ.12వేల పైనే ధర పలకనున్నది. 90 రోజుల్లోనే ఎకరం పంట వేసుకున్న రైతుకు రూ.లక్ష దిగుబడి వస్తున్నది. గతంలో కూడా పొద్దుతిరుగుడు పంటను గ్రామంలో చాలా మంది వేశారు.
స్వల్పకాలంలోనే పొద్దుతిరుగుడు పంట వస్తుంది. సుమారు 90 రోజుల వరకు ఈ పంట చేతికి వస్తుంది. పంటకు ఖర్చు తక్కువ దిగుబడి ఎక్కువగా ఉంటుంది. యాసంగిలో రామాయంపేట మండల వ్యాప్తంగా రైతులు 160 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంట వేశారు. ప్రస్తుతం ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.6500, బయట మార్కెట్లో రూ.12 వేలపైనే ఉంటుంది. ఈసారి పొద్దుతిరుగుడు పంటకు డిమాండ్ బాగానే ఉంటుంది.
పొద్దుతిరుగుడు పంట బాగానే ఉంది. కాని అడవి జంతువులు, పక్షులతోనే ఇబ్బంది. పంట చేతికొచ్చి విత్తులు రావడంతోనే ఎక్కడెక్కడి నుంచో పక్షులు పంట వద్దకు చేరుకుని విత్తులు తినేస్తాయి. అందుకే నేను రోజూ చేను వద్దనే డబ్బాతో చప్పుడు చేసుకుంటూ మంచెపైనే ఉంటా. అన్నం తినడం కూడా మంచె పైనే. చప్పుడు కాకుంటే పక్షులు గుంపులు గుంపులుగా వచ్చి పంటపైనే వాలుతాయి.