సదాశివపేట, మే 26: చిన్నలు, పెద్దలు సేద తీరేందుకు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నిర్మించిన చిల్డ్రన్ పార్కుకు తాళం పడింది. నిర్మాణం పూర్తయి ఏడాదైనా పార్కుకు తాళం తీయడం లేదు. వేసవి ముగుస్తున్నా పార్కును ప్రారంభించక పోవడంతో పట్టణ వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్కును ఎప్పుడు ప్రారంభిస్తారో అని ఎదురుచూస్తున్నారు. నిత్యం బిజీగా ఉండే సదాశివపేట ప్రజలు సేదతీరేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1.50 కోట్లతో చిల్డ్రన్ పార్కును 10వ వార్డులో ఏర్పాటు చేసింది. అందరూ సేద తీరేందుకు చూడచక్కని రీతిలో పార్కు రూపుదిద్దుకున్నది. పార్కులో ఏర్పాటు చేసిన వివిధ ఆకృతులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకునేందుకు అధునాతన ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. పండ్లు, ఫలాలు, జంతువులు, కూరగాయలు తదితర ఆకృతులు అందరినీ ఆకట్టుకునే విధంగా నిర్మించారు. హైదరాబాద్లోని పార్కులను తలపించేలా చిల్డ్రన్ పార్కు ఏర్పాటు చేశారు. అధునాతన హంగులతో పార్కులో అన్ని ఏర్పాట్లు చేయడంతో రాబోయే రోజుల్లో చిల్డ్రన్ పార్కు పిక్నిక్ స్పాట్గా మారే అవకాశం ఉంది. కానీ, అధికారుల నిర్లక్ష్యంతో పార్కు ఇంకా అందుబాటులోకి రావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చిల్డ్రన్ పార్కును అందుబాటులోకి తీసుకురావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.