కొల్చారం, మే 30: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పల్లెపల్లెన ఏర్పాటు చేసిన ప్రకృతివనాలు ఆహ్లాదాన్ని పంచుతూ కనువిందు చేస్తున్నాయి. గ్రామాల్లో ప్రభుత్వ భూమి 20 గుంటలు ఉన్న చోట ఈ వనాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేని గ్రామాల్లో అటవీ భూములను సేకరించి పల్లె ప్రకృతి వనాలను పెంచారు. మూడేండ్ల క్రితం నాటిన మొక్కలు నేడు పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. గ్రామ పంచాయతీ నిధులతో అందులో ప్లిలలు ఆడుకోవటానికి క్రీడా సామగ్రిని సైతం ఏర్పాటు చేశారు. మొక్కల సంరక్షణ బాధ్యతలను వన సంరక్షణ సేవకులకు అప్పగించారు. కూర్చోవడానికి బెంచీలు సైతం ఏర్పాటు చేశారు. మొక్కలు, ప్రకృతి వనాల వివరాలు తెలిపేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజలు రోజూ సాయంత్రం ప్రకృతి వనాల్లో సేద తీరుతూ ఉల్లాసం పొందుతున్నారు.
21 గ్రామాల్లో పచ్చని వనాలు
కొల్చారం మండల వ్యాప్తంగా 21 గ్రామ పంచాయతీలుండగా అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పల్లె ప్రకృతి వనానికి ఉపాధి హామీ నిధులు రూ.5 లక్షలు కేటాయించగా, రూ.3 లక్షలతో సామగ్రి, మొక్కల కొనుగోలు, మరో రూ.2 లక్షలు కూలీల వేతనాల కోసం వెచ్చించారు. ఏపుగా పెరిగే మొక్కలను వనం చుట్టూరా నాటించారు. మధ్యలో వేప, జామ, కానుగ, గుల్మోహర్లతో పాటు పూల మొక్కలు, ఔషధ మొక్కలను నాటారు.
మూడు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నీటిని అందించడంతో మొక్కలు ఏపుగా పెరిగి స్వచ్ఛమైన గాలిని ఇస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో అందుబాటులో ఉన్న నిధులు, మరి కొన్ని గ్రామాల్లో దాతల సహకారంతో పిల్లలు ఆడుకోవడానికి అవసరమైన క్రీడా సామగ్రిని అమర్చారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నాపెద్ద తేడా లేకుండా పల్లె ప్రకృతి వనాల్లో స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తున్నారు. పిల్లలు క్రీడా మైదానాలుగా ఉపయోగించుకుంటున్నారు. మొక్కల మధ్య నుంచి వేసిన వాకింగ్ ట్రాక్ను పెద్దలు వినియోగించుకుంటున్నారు. మండలంలోని పోతంశెట్పల్లి, ఎనగండ్ల, సీతారాంతండా, సంగాయిపేట, పైతర, అంసాన్పల్లి, పోతిరెడ్డిపల్లి, కొంగోడు గ్రామాల్లో మొక్కలు బాగా ఎదిగి ఆహ్లాదకర వాతావరణాన్ని ఇస్తుండగా, పైతర పల్లె ప్రకృతి వనంలో క్రీడా సామగ్రి అమర్చడంతో మండలంలోనే ఆదర్శంగా నిలిచింది.
కనువిందు చేస్తున్నాయి
పట్టణాల్లోనే పార్కులు చూశాం. సీఎం కేసీఆర్ మూడేండ్ల క్రితం శ్రీకారం చుట్టిన పల్లె ప్రకృతి వనాలు నేడు పల్లెకు కొత్త శోభను తీసుకువస్తున్నాయి. పచ్చదనంతో కూడిన ఆహ్లాద వాతావరణంలో చిన్నాపెద్ద తేడాలేకుండా ఉదయం, సాయంత్రం సేద తీరుతున్నారు.
– విష్ణువర్ధన్రెడ్డి,ఏటిగడ్డమాందాపూర్ సర్పంచ్