సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 22: రైతులకు చెల్లించాల్సిన డబ్బులను 72 గంటల్లో వారి ఖాతాల్లో జమ చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, ఎస్పీ రమణకుమార్తో కలిసి ట్రైడెంట్ షుగర్స్ యాజమాన్యం, షుగర్ కేన్ కమిషనర్ తదితరులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీలు మాట్లాడుతూ చెరుకు రైతులకు చెల్లించాల్సిన రూ.9 కోట్లను 72 గంటలలో వారి ఖాతాల్లో జమ చేయాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో ఫ్యాక్టరీని వేలం వేసేందుకు పత్రిక ప్రకటన ఇచ్చేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సూచనల మేరకు పలుమార్లు యాజమాన్యంతో చర్చలు జరిపి రైతులకు బకాయిలు చెల్లించాలని సూచించారు.
యాజమాన్యం ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 20వ తేదీలోగా రైతులకు డబ్బులు చెల్లించాల్సి ఉన్నది. అయినప్పటికీ యాజమాన్యం నుంచి సరైన స్పందన లేకపోవడంతో ట్రైడెంట్ షుగర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం, షుగర్ కేన్ కమిషనర్, ట్రైడెంట్ షుగర్స్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.