మెదక్ : అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్ద శంకరంపేట్ మండలం లక్ష్మాపూర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మూసాపేట గ్రామానికి చెందిన సిద్ధి రాములు(48) లక్ష్మాపూర్ శివారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని ఆయన పేర్కొన్నారు. సిద్ధిరాములుకు లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన చంద్రకళ తో 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.
కాగా, గత ఆరు నెలల క్రితం అతని భార్య చంద్రకళ అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో అతను ఒంటరి జీవితం గడుపుతున్నాడు. వారం రోజుల క్రితం లక్ష్మాపూర్ లో జాతర నిర్వహించగా ఆ జాతర చూడడానికి వెళ్లాడు.
గత కొద్దిరోజులుగా సిద్ధిరాములు పక్షపాతంతో బాధపడుతున్నాడని ఎస్ఐ తెలిపారు కాగా, మృతదేహం కాలిపోవడంతో అదే ప్రదేశంలో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిర్వహించామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.