నర్సాపూర్, డిసెంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ఆటో డ్రైవర్ల బతుకులను అస్తవ్యస్తం చేసిందని సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో సుమా రు 100 ఆటోలతో భారీ ర్యాలీ, చౌరస్తాలో ఆటో డ్రైవర్లు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ ఆటోని నమ్ముకొని కుటుంబాలను పోషిస్తున్న ఆటో కార్మికుల బతుకులు ఇబ్బందికరంగా మారాయని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఆటో డ్రైవర్ల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు ఆంజనేయులు, నాగభూషణం, రాజు, భిక్షపతి, కుమార్, లక్ష్మణ్గౌడ్, ఖధీర్, సత్యనారాయణ, నందు, రాములు, మహేశ్, మునీర్, రమణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.