అమరులస్ఫూర్తితో రాష్ట్రం బంగారు తెలంగాణగా అవతరించింది. సీఎం కేసీఆర్ సారధ్యంలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుంది. దశాబ్ది ఉత్సవాల్లో చివరిరోజైన గురువారం అమరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అమరుల స్తూపం వద్ద నివాళుర్పించి మౌనం పాటించారు. అనంతరం ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ అమరుల స్ఫూర్తి తోనే సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా రని, తెలంగాణ ఏర్పడిన 9ఏండ్లలో అన్ని రంగాల్లో ఎంతో పురోగతి సాధించిందన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబాలను సన్మానించి, సహపంక్తి భోజనం చేశారు.
– నమస్తే తెలంగాణ, మెదక్ నెట్వర్క్ , జూన్ 22
మెదక్ మున్సిపాలిటీ, జూన్ 22 : అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రమని, వారి త్యాగాలు వెలకట్టలేనివని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశా నికి ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్డ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి, కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరులకు శ్రద్దాంజలి ఘటిం చారు. వెల్దుర్తి జడ్పీటీసీ రమేశ్గౌడ్ అమరుల సంస్మరణ తీర్మా నం ప్రవేశపెట్టగా నర్సపూర్ జడ్పీటీసీ బాబ్యానాయక్ బలపరచగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన క్యాక్రమంలో జిల్లాలోని 12 మంది అమరుల కుటుంబ సభ్యులను శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ 2009లో తెలంగా వచ్చుడో, సచ్చుడో నినాదంతో అహింసా మార్గంలో చావు చివరి వరకు వెళ్లి వచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తదో, ఇవ్వదో అంటూ విద్యార్థులు భావోద్వేగానికి గురై శ్రీకాంత్చారి వంటి ఎందరో విద్యార్థులు ప్రాణాలను త్యాగం చేశారన్నారు. మా తెలంగాణ మాకు కావాలంటూ ధర్నాలు, రాస్తారోకోలు, సహాయ నిరాకరణ అనేక నిరసనలు వివిధ రీతుల్లో చేశారని గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్ అండగా నిలిచారు : జడ్పీ చైర్పర్సన్
తెలంగాణ కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారు.. కుటుంబం కంటే తెలంగాణే కావాలంటూ అమరులు ఆత్మ బలిదానం చేశారని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమరవీరుల కుటుంబాలకు అండగా నిలిచారన్నారు. తొమ్మిదేండ్లలోనే రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చి దేశంలోనే ఆగ్రస్థానంలో నిలిపారని తెలిపారు.
అమరుల త్యాగాలు వెలకట్టలేనివి : ఎమ్మెల్యే మదన్రెడ్డి
ఎందరో అమరుల త్యాగఫలం.. కేసీఆర్ దృఢసంకల్పంతో తెలంగాణ సాకారమైందని ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కోసం అసువులుబాసిన అమరుల త్యాగాలను వెలకట్టలేమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వీర మరణం పొందినవారికి మనం ఏం చేసినా తక్కువేనన్నారు. సీఎం కేసీఆర్ అమరుల కుటుంబాలకు అండగా నిలబడి, ఆర్థికసాయం అందించడంతోపాటు ఉద్యోగాలు కల్పించారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన ఉద్యమం, తెలంగాణ ఏర్పాటు తరువాత అశించిన లక్ష్యాలు నేరవేర్చడంతోపాటు విభిన్న రంగాలలో పురోగతిని సాధించమన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, అధికారులు పాల్గొన్నారు.
ఆత్మబలిదానాలతోనే తెలంగాణ ఏర్పాటు : ఎమ్మెల్యేలు
చిన్నశంకరంపేట, జూన్ 22 : అమరుల ఆత్మబలిదానాలతోనే తెలంగాణ వచ్చిందని ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలతాగౌడ్ తెలిపారు. చిన్నశంకరంపేటలో అమరవీరుల స్తూపం వద్ద అమరులకు ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చం ద్రాగౌడ్, కలెక్టర్ రాజార్షిషా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని నివాళులర్పించారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన లబ్ధ్దిదారులకు సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమాసింగ్, తూ ప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, చేగుంట, వెల్దుర్తి మండలాల జడ్పీటీసీలు శ్రీను, రమేశ్గౌడ్, తహసీల్దార్ మహేందర్గౌడ్, ఎంపీడీవో ప్రవీణ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజు, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు పూలపల్లి యాదగిరియాదవ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు హేమచంద్రం పాల్గొన్నారు.
త్యాగాల ఫలితమే తెలంగాణ : ఎస్పీ రోహిణిప్రియదర్శిని
అమరవీరుల త్యాగాలతో తెలంగాణ ఆవిర్భవించిందని ఎస్పీ రోహిణిప్రియదర్శిని పేర్క న్నారు. చిన్నశంకరంపేటలోని అమరులస్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ పోలీసులు అన్ని విభాగాల్లో దేశంలోనే ముందున్నారన్నారు. పోలీసులు శాంతి భద్రతలు కాపాడటానికి అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు.
డిగ్రీ కళాశాలలో సంస్మరణ దినోత్సవం
మెదక్ మున్సిపాలిటీ/ మెదక్ అర్బన్/ అల్లాదుర్గం/ పాపన్నపేట, జూన్ 22 : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గణపతి, వైస్ ప్రిన్సిపాల్ ప్రవీణ్, ఎన్సీసీ అధికారి సుధాకర్ పాల్గొన్నారు.
మెదక్ మున్సిపాలిటీలో అమరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, కౌన్సిలర్లు మాట్లాడుతూ.. అమర వీరుల ఆశయాలను సాధిస్తామన్నారు. తెలంగాణ కోరకు ప్రాణత్యాగాలు చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య, శ్రీకాంత్చారి, యాదయ్య, వేణుగోపాల్రెడ్డి త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
అల్లాదుర్గంలోని ఐకేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ అనిల్కుమార్రెడ్డి, ఎంపీడీవో శంకర్, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. పాపన్నపేట మండలకేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ చందనాప్రశాంత్రెడ్డి, ఎంపీడీవో జగదీశ్వరచారి పాల్గొన్నారు.