మానకొండూర్ రూరల్, నవంబర్ 11: చెంజర్ల శివారు గ్రామాలైన నాటి ఖాదరగూడెం, నిజాయితీగూడెం, పెద్దూర్పల్లి, చెంజర్ల గ్రామాలకు ప్రభుత్వం ఖర్చు పెట్టి సాగు, తాగు నీరు అందించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. గ్యారెంటీ లేనోళ్లు కాంగ్రెస్ పార్టీ వారు వస్తున్నారు వారితో జాగ్రత్తగా ఉండాలని, మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. మానకొండూర్ మండలంలోని ఖాదరగూడెం, నిజాయితిగూడెం, పెద్దూర్పల్లి గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ 60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభివృద్ధి చేయని వారు ఇప్పుడు వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం జలాలతో ఖాదరగూడెం, నిజాయితీగూడెం, పెద్దూర్పల్లి గ్రామాల్లో నాడు తాగు నీటికే గొడవలైన చరిత్ర అని గుర్తు చేశారు. రైతులకు ఇచ్చే రైతు బంధుకు ఎకరాకు రూ. 10 వేలు, బీమా కింద రైతు మరణిస్తే రూ.5 లక్షలు ఇస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇస్తున్నమన్నారు. త్వరలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం ఇస్తామన్నారు. ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా కల్పించనున్నట్లు తెలిపారు. మహిళల కోసం ముఖ్యంగా ఆడబిడ్డల కోసం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్తో రూ.1,00,116 అందిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ హయాంలో ఒక్కరికి పింఛన్ వస్తే, వారు మరణిస్తేనే వేరే వారికి ఇచ్చేవారని, కేసీఆర్ సీఎం అయ్యాక వికలాంగులకు రూ. 4016, ఆసరా పింఛన్ రూ.2016 అందిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక వికలాంగులకు రూ.6016, ఆసరా పింఛన్ను రూ. 5016 పెంచి అందించనున్నట్లు మ్యానిఫెస్టోలో సైతం తెలియజేయడం జరిగిందన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఏడాది కాలంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని, ఇప్పటికే 5 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు కాగానే ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఖాదరగూడెంలో జిల్లెల్ల మల్లయ్య అనే వృద్ధుడిని ప్రత్యేకంగా పరామర్శించి పింఛన్ గురించి అడగగా సానుకూలంగా స్పందించారు. జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి మన రసమయి బాలకిషన్ అన్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని, వాళ్లు పాలించే కర్ణాటకలో సీఎం సీటు కోసమే ఇంకా నువ్వానేనా అని డజన్ మంది లైన్లో ఉన్నారని ఎద్దేవ చేశారు. కానీ మనకు సీఎంగా కేసీఆర్ మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. మరోసారి రసమయి బాలకిషన్కు ఆశీర్వదించి పట్టం కట్టాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, శంకరపట్నం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట మహిపాల్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.