గ్రూప్ 4 పరీక్షలు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో శనివారం సజావుగా జరిగాయి. గంట ముందుగానే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకొని హాల్ టికెట్, రూమ్ నెంబర్లు చూసుకున్నారు. పలువురు ఆలస్యంగా రావడంతో అధికారులు లోనికి అనుమతించలేదు. ఎక్కడా ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పకడ్బందీ బందోబస్తు చేపట్టారు. కలెక్టర్లు శరత్కుమార్, రాజర్షి షాలు పలు సెంటర్లను తనిఖీ చేసి, అభ్యర్థుల హాజరు, సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.
– సంగారెడ్డి/మెదక్ న్యూస్నెట్వర్క్, జూలై 1
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 1: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జిల్లాలో శనివారం నిర్వహించిన గ్రూప్-4 పరీక్ష సజావుగా సాగింది. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో జరిగిన పేపర్-1, పేపర్-2 పరీక్షలను కలెక్టర్ డాక్టర్ శరత్ తనిఖీ చేశారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 101 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 33,452 మంది అభ్యర్థుల్లో పేపర్-1కు 27,962 మంది, పేపర్-2కు 27,826 మంది అభ్యర్థులు హాజరయ్యారు. స్థానిక బైపాస్ రోడ్డులోని పరీక్షా కేంద్రాలను కలెక్టర్ శరత్ తనిఖీ చేశారు. ఆయన వెంట తహసీల్దార్ విజయ్కుమార్ ఉన్నారు.
మెదక్ జిల్లాలో..
మెదక్ మున్సిపాలిటీ, జూలై 1: మెదక్ జిల్లాలో శనివారం నిర్వహించిన గ్రూప్-4 పరీక్షలు సజావుగా సాగాయి. జిల్లాలో 11,275 మంది అభ్యర్థులకు 30 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం పేపర్-1కు 11,275 మందికి 9,7079, పేపర్-2కు 9,695 మంది హాజరయ్యారు. సీసీ కెమెరాల నిఘాలో పోలీసు బందోబస్తు మధ్య పరీక్షలు కొనసాగింది.
నర్సాపూర్లో..
నర్సాపూర్, జూలై1: నర్సాపూర్లోని పలు గ్రూప్-4 రాత పరీక్షా కేంద్రాల్లో పరీక్ష సజావుగా ముగిసింది. పట్టణంలో 8 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్షకు ఎలాంటి ఆటంకాలు జరుగకుండా అధికారులు, సీఐ షేక్లాల్ మధార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. 3169 మందికి 2680 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నర్సాపూర్లోని బీవీఆర్ఐటీ కళాశాలలోని గ్రూప్-4 పరీక్షా కేంద్రాన్ని మెదక్ కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్ రమేశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెంటర్ నిర్వాహకులను అభ్యర్థుల హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీరితో ఆర్డీవో శ్రీనివాసులు ఉన్నారు.