సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 3: బీఆర్ఎస్ సర్కారు హయాంలో 2023 ఆగస్టులో గురుకుల బోర్డు నిర్వహించిన నియామక పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. జిల్లా కేంద్రంలోని తారా ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, తాత్కాలిక అధ్యాపకులు గురుకుల విద్యాలయాల్లో టీజీటీ, జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిగ్రీ లెక్చరర్(డీఎల్) పోస్టులకు ఎంపికయ్యారు.
కష్టపడ్డాను.. సాధించాను..
జీవితంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించాను. ఈ క్రమంలోనే తారా ప్రభుత్వ కళాశాలలో అతిథి అధ్యాపకురాలిగా పనిచేస్తున్న, గతేడాది ఉద్యోగం మానేసి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాను. కాస్త ఆలస్యంగా సెట్ అర్హత సాధించినప్పటికీ డీఎల్ పోస్టుకు దూరమయ్యాను. నిరాశ చెందకుండా టీజీటీ పోస్టును ఓపెన్ కేటగిరీలో సాధించినందుకు సంతోషంగా ఉంది.
– డి.శ్రావణ కీర్తి, గణితం, టీజీటీకి ఎంపిక
కల నెరవేరింది
ఎన్నోసార్లు చివరి అంచుల్లో ఉద్యోగాలను కోల్పోయాను. 2014 నుంచి కాంట్రాక్ట్ అధ్యాపకురాలిగా పనిచేస్తున్న నాకు సెట్ అర్హత ఉన్నప్పటికీ కేవలం 20 రోజుల సర్టిఫికెట్ గ్యాప్తో గత రెగ్యులరైజేషన్లో అవకాశం కోల్పోయాను. అదే పట్టుదలతో కృషిచేసి గురుకుల విద్యాలయాల్లో డిగ్రీ లెక్చరర్ పోస్ట్ సాధించా. చాలా సంతోషంగా ఉంది. నా కష్టానికి ఫలితం దక్కింది. ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం సాధించాను. నా కల నెరవేరినందుకు ఆనందంగా ఉంది.
– వినోద, హిస్టరీ, డీఎల్కు ఎంపిక
గురుకులంలో బోధించే అవకాశం వచ్చింది
పదేండ్లుగా తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్ట్ అధ్యాపకునిగా బోధిస్తున్న నాకు ఇప్పుడు గురుకులంలో బోధించే అవకాశం వచ్చింది. 2014 నుంచి తారా కళాశాలలో గణిత విభాగంలో విధులు నిర్వహిస్తున్నా. ఇటీవల జరిగిన క్రమబద్ధ్దకరణలో భాగంగా కొంతమందికి మాత్రమే ఆ అవకాశం లభించింది. అంతటితో నిరాశ చెందకుండా నా ప్రతిభను నమ్ముకొని గురుకుల పోటీ పరీక్షలకు హాజరయ్యాను. జూనియర్ లెక్చరర్ పోస్టుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది.
– పి.లింగస్వామి, గణితం, జేఎల్కు ఎంపిక
రెండు ఉద్యోగాలతో నాన్న కండ్లల్లో ఆనందం..
మాది సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రా మం. కష్టపడి చదువుకున్నాను. మా నాన్న పరశురాములు సెంట్రింగ్ మేస్త్రి, అమ్మ పద్మ రజక వృత్తి చే స్తూ నన్ను చదివించారు. రజక వృత్తి అయినప్పటికీ తమ పిల్లలు ఉన్నతంగా ఎ దగాలనేది మానాన్న కల. వారి కలను నిజం చేయాలనే సంకల్పంతో తారా ప్రభుత్వ కళాశాలలో 2017 నుంచి అతిథి అధ్యాపకునిగా చేరాను. పేద కుటుంబం నుంచి వచ్చిన నేను ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టంగా మారిన నేపథ్యంలో గురుకుల నియామకాల కోసం గట్టిగా కష్టపడ్డాను. నా డిగ్రీ గురువు పెద్ద బోయిన కుమార్ ప్రేరణతో కష్టపడి టీజీటీ, జేఎల్ పోస్టులు సాధించా. నన్ను ఈ స్థాయికి చేర్చిన నా కుటుంబం, అధ్యాపకులందరికీ కృతజ్ఞతలు.
– ఎం. రాజు, బాటనీ, టీజీటీ, జేఎల్కు ఎంపిక
మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక
మద్దూరు (ధూళిమిట్ట), మార్చి 3: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని మర్మాముల గ్రామానికి చెందిన గుండ్రెడ్డి వెంకటమ్మ, వీరనర్సింహారెడ్డి దంపతుల కుమారుడు గుండ్రెడ్డి మహిపాల్రెడ్డి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసి న గురుకుల ఫలితాల్లో ఒకేసారి మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. కామర్స్ విభాగంలో జూనియర్ లెక్చరర్గా ఉద్యోగంతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలను సాధించాడు. ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే మహిపాల్రెడ్డి పలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. తనకు ఇష్టమైన ఉద్యో గం జూనియర్ లెక్చరర్ అని, మూడు ఉద్యోగాల్లో నుంచి జూనియర్ లెక్చరర్గా చేరతానని తెలిపాడు. మహిపాల్రెడ్డిని గ్రామస్తులు, బంధువులు, కుటుంబసభ్యులు అభినందించారు.