యాసంగి ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సంగారెడ్డి జిల్లాలో 209 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా ఇప్పటికే 97 చోట్ల సేకరణ షురూ అయింది. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో కేంద్రాలు ప్రారంభిస్తుండగా, త్వరలోనే అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2022-23 యాసంగి సీజన్లో జిల్లాలో 1,09,554 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, మార్కెట్లోకి 1,83,480 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. ఇప్పటివరకు 400 మెట్రిక్ టన్నులు సేకరించి, ఏ గ్రేడ్ క్వింటాల్కు రూ.2060, సాధారణ రకానికి రూ.2040 మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తున్నది. ప్రస్తుతం అకాల వర్షాలతో పలుచోట్ల కోతలు నిలిచిపోగా, వానలు తగ్గిన వెంటనే పంట విక్రయించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో కొనుగోళ్లు ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని, చివరి గింజ వరకూ కొనుగోలు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశాలు జారీచేయడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
– సంగారెడ్డి (నమస్తే తెలంగాణ) ,మే2
సంగారెడ్డి, మే 2 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సంగారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. కాగా, పలుచోట్ల ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో జిల్లాలో ఇప్పటి వరకు 400 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మరో వారంలో కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. సంగారెడ్డి జిల్లాలో యాసంగి సీజన్లో 76186 మంది రైతులు 1,09,554 ఎకరాల్లో వరి సాగు చేయగా, 2,03,828 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా. రైతుల అవసరాలు తీరగా మార్కెట్లోకి 1,83,480 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందనన్న అంచనాతో అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఇప్పటికే అధికారులతో సమీక్షలు చేసి ధాన్యం సేకరణలో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, చివరి గింజ వరకూ కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఇటీవలే సంగారెడ్డి కలెక్టర్ శరత్ పౌరసరఫరాలశాఖ, ఐకేపీ, పీఏసీఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎక్కడా రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులకు అవసరమైన చోట కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు చేర్చాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు.
209 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గతేడాది యాసంగిలో 120 కొనుగోలు కేంద్రాల ద్వారా 73,718 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ప్రస్తుత యాసంగి 2022-23లో రెట్టింపు ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఐకేపీ ద్వారా 97, పీఏసీఎస్ ద్వారా 86, డీసీఎంఎస్ ద్వారా 26 మొత్తం 209 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు ఐకేపీ 30, పీఏసీఎస్ 55, డీసీఎంఎస్ 12 మొత్తం 97 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. మరో వారం రోజుల్లో మిగితా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. కాగా, 97 కొనుగోలు కేంద్రాల్లో 400.7 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు.
ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాల్లో తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, గన్నీబ్యాగులు, తేమ యంత్రాలను అందుబాటులో ఉంచారు. ధాన్యం కొనుగోలుకు 45,86,250 గన్నీ బ్యాగులు అవసరమవగా, ఇప్పటి వరకు అధికారులు 39,28,597 బ్యాగులను అందుబాటులో ఉంచారు. మిగితా 6,57,653 బ్యాగులను పౌరసరఫరాల సంస్థ సమకూర్చుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లో డబ్బులు వారి ఖాతాల్లో జమచేస్తున్నది. ప్రభుత్వం గ్రేడ్ ఏ రకం ధాన్యం క్వింటాలుకు రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 మద్దతు ధరను ప్రకటించింది.