జహీరాబాద్, సెప్టెంబర్ 8: ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా ఏర్పుల నరోత్తంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు నియమకపత్రాన్ని నరోత్తంకు అందజేశారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు శుక్రవారం ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్లో ఉన్న నరోత్తం ఇటీవల సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్ గ్రామానికి చెందిన నరోత్తం నీటిపారుదల శాఖలో డీఈఈగా పని చేస్తూ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి రాజకీయల్లోకి వచ్చారు.
2009లో జహీరాబాద్ నియోజకవర్గ ప్రాతినిథ్యాన్ని ఎస్సీలకు కేటాయించడంతో నరోత్తం ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2009, 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన నరోత్తం బీఆర్ఎస్లో చేరిన తర్వాత కార్పొరేషన్ పదవి రావడంతో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు రుణపడి ఉంటానని తెలిపారు. బీఆర్ఎస్ అభివృద్ధికి, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో ఎస్సీ కార్పొరేషన్ చైర్మగా నియమించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.