దుబ్బాక, జనవరి 12: స్వామి వివేకానందుడు యావత్ ప్రపంచానికి ఆదర్శప్రాయుడని, ఆయన ప్రసంగాలు, సూక్తులు యువతకు స్ఫూర్తిదాయకమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. దుబ్బాక వైశ్య భవన్లో ట్రస్మా ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని శుక్రవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతలో ఉండాల్సిన లక్షణాలను చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి స్వామి వివేకానందుడని గుర్తు చేశారు. యువత మంచి లక్ష్యాలతో ముందుకు వెళ్తే తప్పకుండా విజయం సాధిస్తారని సూచించారు. భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుకున్న స్థాయిలో విద్యావిధానం కొనసాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థులకు సరైన విద్య అందడం లేదన్నారు.
కొన్ని పాఠశాలల్లో 10 నుంచి 30 మంది విద్యార్థులు మాత్రమే ఉంటున్నారని, ఇందుకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ సరైన బోధన జరగడం లేదన్నారు. దుబ్బాకలో నిర్మించిన కేసీఆర్ బడిని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ట్రస్మా ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడం సంతోషకరమన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డిని ట్రస్మా ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్ గన్నే వనితాభూంరెడ్డి, ట్రస్మా దుబ్బాక నియోజకవర్గ అధ్యక్షుడు మాలె రమేశ్ , సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల శ్రీనివాస్రెడ్డి, ప్రతినిధులు మహిపాల్రెడ్డి, రేపాక భాస్కర్రెడ్డి, శంకర్, కౌన్సిలర్లు దేవుని లలిత, ఆస యాదగిరి, బాలకృష్ణగౌడ్, బీఆర్ఎస్ నాయకులు రాజమౌళి, ఎల్లారెడ్డి, భూంరెడ్డి, శ్రీనివాస్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.