గజ్వేల్, ఫిబ్రవరి 20: కాళేశ్వర జలాలతో చెరువులు, కుంటలు నింపిన సీఎం కేసీఆర్ మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి తెలంగాణలో మరోసారి నీలివిప్లవం తీసుకువచ్చారు. రాష్ట్రంలోని అన్ని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో ఉచితంగా చేపపిల్లలు వేయడంతో మత్స్యకారులకు చేతినిండా పనిదొరికింది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అధికారం చేపట్టగానే అటు కాలం అనుకూలించి సకాలంలో వర్షాలు కురవడమే కాకుండా, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు, కుంటల్లో గోదావరి జలాలను నింపడంతో ఏడాదిపొడవునా నిండుకుండల్లా చెరువులు, కుంటలు మారిపోయాయి.
నీటి వనరులను సద్వినియోగం చేసుకుని రైతులకు సాగునీరందించడంతో పాటు మత్స్యకారులకు జీవనోపాధిని కల్పించాలన్న ఉద్దేశంతో గత ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం చెరువులు, కుంటల్లో ఉచిత చేపపిల్లలను వదిలింది. దీంతో ఈ ప్రాంత ముదిరాజ్, గంగపుత్ర కులస్తులంతా తమ కులవృత్తి అయిన చేపలు పట్టడంతో ఆర్థికంగా బలపడుతున్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలో…
నియోజకవర్గంలోని గజ్వేల్, వర్గల్, ములుగు, మర్కూక్, జగదేవ్పూర్, కొండపాక, తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లోని మొత్తం 1993 చిన్నా పెద్ద చెరువులు, కుంటల్లో తెలంగాణ ప్రభుత్వం ఏడేళ్లుగా ఉచితంగా 4 కోట్ల చేపపిల్లలు వదిలింది. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో 20,20,815 రొయ్య పిల్లలను వేసింది. కొండపోచమ్మ సాగర్లో ముంపు గ్రామాల ప్రజలంతా చేపలు పట్టుకునేలా ప్రభుత్వం జీవో విడుదల చేయగా, ముదిరాజ్లు, గంగపుత్రులు తమకే చేపలు పట్టే హక్కును కల్పించాలని కోరుతున్నారు. కాగా నియోజకవర్గవ్యాప్తంగా చెరువులు, కుంటల్లో భారీస్థాయిలో చేపలు పెరుగుతుండగా వాటిని పట్టి గజ్వేల్, హైదరాబాద్ మార్కెట్కు తరలిస్తూ మత్స్యకారులు మంచి లాభాలను గడిస్తున్నారు.
మన చేపలు మనకే…
ఒకప్పుడు గజ్వేల్ సమీకృత మార్కెట్లో పూర్తిగా హైదరాబాద్ నుంచి వచ్చిన చేపలే విక్రయించగా, ప్రస్తుతం స్థానిక చెరువులు, కుంటల నుంచి తెచ్చిన చేపలనే ఎక్కువగా విక్రయిస్తున్నారు. చెరువులు, కుంటల్లో పెరిగిన చేపలు సాధారణ పరిస్థితుల్లో పెరగడంతో పెంచిన చేపల కన్నా ఎంతో రుచితోపాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న విశ్వాసంతో లోకల్ చేపలనే ఎక్కువగా ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చెరువుల్లో 3 నుంచి 10 కిలోల వరకు ఉన్న చేపలు దొరుకుతుండడంతో మత్స్యకారులు, ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 56 మత్స్యకార సొసైటీలు ఉండగా, 3429 మంది మత్స్యకారులు శాఖాపరంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారంతా చేపలు పడుతూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు.
ప్రభుత్వం చొరవతో మత్స్య సంపద పెరిగింది…
తెలంగాణ ప్రభుత్వం చొరవతో జిల్లావ్యాప్తంగా మత్స్యసంపద బాగా పెరిగింది. అన్ని చెరువులు, కుంటల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపపిల్లలను వేస్తున్నాం. గత 7 సంవత్సరాలుగా చేపలు పట్టి మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. గ్రామాల నుంచి వలసలు వెళ్లిన వారు సైతం తిరిగి గ్రామాలకు చేరుకుని మత్స్యకారులుగా జీవనాన్ని సాగిస్తున్నారు. జిల్లాలో కొత్తగా 48 సంఘాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. 25 కొత్త సొసైటీల ఏర్పాటుకు అనుమతి లభించింది.
– మల్లేశం, మత్స్యశాఖ జిల్లా అధికారి
కులవృత్తులకు జీవం పోస్తున్న సీఎం కేసీఆర్..
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయంతోపాటు అన్ని కులవృత్తులకు మళ్లీ జీవం పోస్తున్నారు. గ్రామాల్లో గతంలో లాగా రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటూ ఉండగా కులవృత్తులపై ఆధారపడి జీవించే గొల్లకుర్మలు, ముదిరాజ్లు, గంగపుత్రులు, రజక తదితర కులవృత్తిదారులకు సహకారం అందిస్తూ వారు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు సహకారాన్ని అందిస్తున్నారు. గతంలో సరైన వర్షాలు, నీరు లేక చెరువులు, కుంటలు ఎండి పోగా మత్స్య సంపద కనుమరుగై మత్స్యకారులంతా గ్రామాల నుంచి వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్లారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ చొరవతో కాళేశ్వరం జలాలతో చెరువులు, కుంటలు నిండుకుండల్లా ఉండడంతో వాటిలో ప్రభుత్వమే ఉచితంగా చేపపిల్లలను వదిలి మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. సీఎం గారికి మత్స్యకారుల తరపున ధన్యవాదాలు.
– వంటేరు ప్రతాప్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్
గ్రామగ్రామాన చేపల పండుగ
సీఎం కేసీఆర్ చొరవతో అన్ని చెరువులు, కుంటల్లో అద్భుతమైన మత్స్య సంపద పెరుగుతుంది. చేపలు పట్టి మత్స్యకారులంతా ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఏడేండ్లుగా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీతో మత్స్యకారుల ఉపాధికి భరోసా లభించింది. ఇతర రాష్ర్టాలకు, దేశాలకు, పట్టణాలకు వలస వెళ్లిన మత్స్యకారులు తిరిగి గ్రామాలకు చేరుకుని చేపలు పట్టి ఉపాధి పొందుతున్నారు. చేపల రవాణాకు అవసరమైన వాహనాలను కూడా సబ్సిడీపై తెలంగాణ ప్రభుత్వం అందించడంతో చేపల వ్యాపారాలకు మరింత అనువుగా మారింది. మరిన్ని మత్స్యకార సొసైటీలు మరిన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– కొట్టాల యాదగిరి, నాచారం ఆలయ కమిటీ మాజీ చైర్మన్
మేక, కోడి మాంసం విక్రయాలకు ధీటుగా చేపల విక్రయాలు
గజ్వేల్ సమీకృత మార్కెట్లోని మాంసం విక్రయాలలో మేక, కోడి మాంసం విక్రయాలకు ధీటుగా చేపల మాంసం అమ్మకాలు సాగుతున్నాయి. మాంసం స్టాళ్లు మొత్తం 52 ఉండగా 27 మటన్, 5 చికెన్ స్టాళ్లుండగా, 20 చేపల స్టాళ్లున్నాయి. చేపల కొనుగోళ్లపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. స్థానికంగా ఉన్న చెరువులు, కుంటల నుంచి భారీగా పెరిగిన చేపలు మార్కెట్కు వస్తుండడంతో ప్రత్యేకంగా పెంచిన చేపల కన్నా ఆరోగ్యకరమని భావించే ప్రజలు లోకల్ చేపలే ఎక్కువగా కొంటున్నారు. గతంలో చిన్న వీధిలో చేపల విక్రయాలు అందరికీ ఇబ్బంది కలిగేది. ప్రస్తుతం సమీకృత మార్కెట్లో విక్రయడంతో పరిశుభ్ర వాతావరణంలో ఇటు వ్యాపారులు, అటు కొనుగోలుదారులకు సౌకర్యంగా మారింది. మత్స్యకారులు, వ్యాపారుల తరపున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– మాదాసు శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్