భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం హర్షణీయం. శుక్రవారం పీవీకి అత్యున్నత పౌర పురస్కారం రావడంపై పలువురు తమ అభిప్రాయాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న దేశాన్ని గాడిన పెట్టిన మహనీయుడని, ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పీవీ గ్రామీణ స్థాయి నుంచి దేశ ప్రధానిగా ఎదగడం ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ పీవీ కుటుంబానికి ఎంతో గౌరవం ఇచ్చి ఆయన సేవలకు గుర్తింపునిచ్చింది.
దుబ్బాక, ఫిబ్రవరి 9: తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించడం సంతోషకరం. బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణల ఆధ్యుడు, తెలంగాణ ప్రతిష్టను ఖండంతారాలకు చాటిన గొప్ప వ్యక్తి పీవీకి భారతరత్న ఇవ్వాలని మొదటిసారిగా డిమాండ్ చేసింది తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆరే. కేసీఆర్ ప్రభుత్వంలో శతజయంతి ఉత్సవాలను నిర్వహించాం.
గజ్వేల్, ఫిబ్రవరి 9: బహుబాషా ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ప్రధానిగా చేసిన సేవలు అమోఘం. తెలుగుగడ్డ మీద పుట్టి దేశ ప్రధానిగా ఎదగడం హర్షించదగిన విషయం. ఆర్థిక సంస్కరణలతో ఖ్యాతి పొందారు. 16 భాషాల్లో అనర్గళంగా మట్లాడగలిగే సత్తా ఆయనది. ఆయనకు గత ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది.
హుస్నాబాద్, ఫిబ్రవరి 9: భారత మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నర్సింహారావుకు భారతరత్న అవార్డు రావడం తెలంగాణకు గర్వకారణం. కష్టాల్లో ఉన్న దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో ఆదుకున్నది పీవీ మాత్రమే.. దేశానికి పీవీ చేసిన సేవలు ఎనలేనివి. ఆయన పుట్టిన గడ్డకు ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా పనిచేయడం నా అదృష్టం.
గజ్వేల్అర్బన్, ఫిబ్రవరి 9: దివంగత పీవీ నరసింహారావుకు కేంద్రప్రభుత్వం భారతరత్న ప్రకటించడం తెలంగాణకు గర్వకారణం. గతంలో రాష్ట్రం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా పీవీని గుర్తు చేసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్న ప్రకటించి తగిన న్యాయం చేసింది. ఇది తెలుగువారికి గొప్ప విషయం.
సిద్దిపేట, ఫిబ్రవరి 9: తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు పీవీ నర్సింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వడం హర్షణీయం. దక్షిణ భారతం నుంచి ప్రధానిగా సేవలందించిన గొప్ప వ్యక్తి పీవీ. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పీవీకి భారతరత్న ఇవ్వాలని రాష్ట్రశాసన సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల మండల పరిధిలోని రిమ్మనగూడ సమీపంలోని సురభి దయాకర్రావు ఫార్మసీ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.