పాపన్నపేట, మార్చి 2: ఏడుపాయల జాతర ఖ్యాతి నలుదిశలా చాటేలా వైభవంగా నిర్వహించాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేశ్ సూచించారు. జాతర నిర్వహణపై శనివారం పాపన్నపేట మండలంలోని ఏడుపాయల హరిత రెస్టారెంట్లో జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా జాతర ఏర్పాట్లు చేయాలన్నారు.ఈ నెల 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు జాతర జరుగుతుందన్నారు. భక్తులకు లోటుపాట్లు కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతర విజయవంతం చేయాలని సూచించారు. బారీకేడ్లు, సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలన్నారు. పారిశుధ్య నిర్వహణ , షవర్లు, తాగునీటి కుళాయిలు, మరుగుదొడ్లు అందుబాటులోకి తేవాలన్నారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చూడాలన్నారు. సరిపడా బస్సులు నడపాలని, గజ ఈతగాళ్లు, వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను అదనపు కలెక్టర్లు ఆదేశించారు. ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉంచాలన్నారు. సమీక్షలో ఆర్డీవో రమాదేవి, దేవాదాయ కార్యనిర్వహణ అధికారి మోహన్ రెడ్డి, ఆలయ చైర్మన్ బాలాగౌడ్, తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ, రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, లీగల్ మెట్రాలజీ, ఆర్టీసీ, ఫైర్, మెడికల్, విద్యుత్, మత్స్య శాఖ, వెటర్నరీ, సంబంధిత అధికారులు, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, ఏడీ మైన్స్ జయరాజ్, ఆర్టీసీ డీఎం సుధ, ఇండస్ట్రీస్ జీఎం కృష్ణమూర్తి, పీఆర్ ఈఈ నరసింహులు, ఆర్అండ్బీ ఈఈ సర్ధార్ సింగ్, అధికారులు పాల్గొన్నారు.