మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 21 : పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధం చేస్తూ వెనకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎఫ్ఎల్, ఉన్నతి, లక్ష్య కార్యక్రమాలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘లక్ష్య’ కార్యక్రమంలో నిర్ధేశించిన కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించారు. వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, చదువు పట్ల ఆసక్తి పెంచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి నుంచి ఉదయం, సాయంత్రం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. విద్యార్థులు రోజూ పాఠశాలకు హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. పోషకుల సమావేశాలు నిర్వహించి విద్యార్థుల ప్రగతి గురించి చర్చించాలని సూచించారు. ఉన్నతి, తొలిమెట్టు కార్యక్రమాలపై అమలుపై మండల విద్యాధికారు, నోడల్ అదికారులు, సీపీడీ టీమ్ సభ్యులతో చర్చించి క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలయ్యేలా పలు సూచనలు చేశారు. విద్యార్థులతో అభ్యసన సామర్థ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు బోధన చేయాలన్నారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండ విద్యాధికారులు, నోడల్ అధికారులు తమ పరిశీలన అంశాలను తప్పకుండా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమాలు అమలుపై జనవరి మొదటి వారంలో మరోకసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ వెల్లడించారు.
ఇంటర్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గురువారం తన చాంబర్లో జిల్లా ఇంటర్ నోడల్ అధికారి సత్యనారాయణ, జూనియర్ కళాశాలల అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. విద్యార్థులు సెల్ ఫోన్, సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలని సూచించారు. జిల్లాలో అన్ని కళాశాలల ఈ నెల 28న అధ్యాపకులు, తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలన్నారు. విద్యార్థులు ఏ,బీ,సీ, డీలుగా విభజించాలన్నారు. సమావేశాలకు సీ,డీ గ్రూపు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి 1 నుంచి విద్యార్థులకు స్పెషల్ స్టడీ అవర్స్, స్పెషల్ స్లీప్ టెస్ట్లు నిర్వహించాలన్నారు. ఈ నెల చివరి వరకు సిలబస్ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశాల్లో అదనపు వెంకటేశ్వర్లు, రమేశ్, జిల్లా విద్యాధికారులు రమేశ్, రాధాకిషన్, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన్మూర్తి, మండల విద్యాధికారులు, నోడల్ అధికారులు, జిల్లా ప్యానల్ సపోర్టింగ్ టీమ్ ప్రధానోపాధ్యాయులు, సీపీడీ టీమ్ సభ్యులు, సీఎస్ఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.