మెదక్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పాలనలో మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి దిశలో పయనిస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి కృషిచేస్తున్నారు. సీఎం కేసీఆర్ మెదక్ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. మెదక్లో నూతన సమీకృత కలెక్టరేట్, పోలీస్ కార్యాలయం ఏర్పాటు చేశారు. మెదక్ పట్టణంలో నాలుగు వరుసల రోడ్డు, సెంట్రల్ లైంటింగ్, కూడళ్ల సుందరీకరణ చేపట్టడంతో పట్టణం కొత్త రూపును సంతరిచుకుంది.గ్రామాలు, మండల కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయి.
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నా. వివిధ పనుల కోసం సీఎం కేసీఆర్ కోట్ల రూపాయలు మంజూరు చేశారు. జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో మిషన్ భగీరథ మంచినీటిని సరఫరా చేస్తున్నాం. జిల్లా ఏర్పడిన తర్వాత కలెక్టరేట్ భవనం, ఎస్పీ కార్యాలయంతో పాటు ఎంసీహెచ్ను మంజూరు చేయించాను. నియోజకవర్గంలో రూ.1167 కోట్లతో రోడ్ల అభివృద్ధికి నిధులు తెప్పించాను. ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపునకు సీఎం కేసీఆర్ రూ.43 కోట్లు నిధులు కేటాయించారు. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలకు పెద్దఎత్తున నిధులు తెచ్చా. అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా పాలన కొనసాగిస్తున్నా. నా హయాంలో అభివృద్ధి ఎంతో కృషి చేశా.
115 ఏండ్ల క్రితం నిర్మించిన ఘనపూర్(వనదుర్గా) ప్రాజె క్టు నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. నవాబుల కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు సీమాంధ్ర పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురైంది. స్వరాష్టంలో పూర్వవైభవాన్ని సంతరించుకుంది. ఈ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ వనదుర్గాగా నామకరణం చేశారు. ప్రాజెక్టు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ప్రాజెక్టు ఎత్తు పెంపునకు రూ.43.64 కోట్టు కాగా, కొల్చారం, పాపన్నపేట మండలా ల్లో 190 ఎకరాల భూ సేకరణకు రూ.13.10 కోట్లు ఇచ్చింది. ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేసే మహబూబ్నహర్, ఫతేనహర్ కెనాళ్లను అభివృద్ధి చేసింది. మెదక్, పాపన్నపేట, హవేళీఘనపూర్ మండలాల్లో ఆయా కాలువల పరిధిలో చెరువులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. సింగూరు ప్రాజెక్టు నుంచి వనదుర్గా ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయడంతో మంజీరా నది పరీవాహక ప్రాం త రైతులు పంటలను పండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఘనపూర్ ప్రాజెక్టుకు పూర్వవైభవం వచ్చింది. 2014లో నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, అప్పటి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి వెనక్కి వెళ్లిన జైకా నిధులు రూ.25 కోట్లను తెప్పించారు. 2014 డిసెంబర్ 17న సీఎం కేసీఆర్ ఘనపూర్ ఆనకట్టను సందర్శించి హెలీకాప్టర్ ద్వారా వీహంగ వీక్షణం చేసి రూ.50 కోట్లు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆనకట్ట ఎత్తు పెంపునకు రూ.43.64 కోట్లు మంజూరు చేశారు. ఆనకట్ట ఎత్తు పెంపుతో 30వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఘనపూర్ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు మంజూరు చేశారు.
మెతుకుసీమ మెదక్ ప్రాంతం తొమ్మిదేళ్లలో అనూహ్య ప్రగతి సాధించింది. మెదక్ నియోజకవర్గంలోని మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలను రూ.106 కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి చేసింది. మెదక్ జిల్లా కేంద్రంలోని గోసంద్రం చెరువును రూ.9 కోట్లతో మినీ ట్యాంక్బండ్గా అభివృద్ధి చేసింది. మెదక్ పట్టణంలో రూ.20 కోట్లతో మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రభుత్వం నిర్మించింది. రూ.180 కోట్లతో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నది. మిషన్ కాకతీయలో రూ.340 కోట్లతో చెరువులను అభివృద్ధి చేసింది. జిల్లా కేంద్రంలో 32 ఎకరాల్లో రూ.67.07 కోట్లతో సమీకృత కలెక్టరేట్, 63 ఎకరాల్లో రూ.38.50 కోట్లతో రాజభవనాన్ని తలపించేలా జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ సర్కారు నిర్మించింది. రూ.50 కోట్లతో మహబూబ్నహర్, ఫత్తేనహర్ కాలువల సిమెంట్ లైనింగ్ పనులు పూర్తిచేసింది. మెదక్ నియోజకవర్గంలోని మెదక్ మండలం ర్యాలమడుగు హల్దీవాగుపై రూ.20.98 కోట్లతో చెక్డ్యాం, మంజీర వాగుపై హవేళీఘనపూర్ మండలం సర్ధన గ్రామంలో రూ.12.15 కోట్లతో చెక్డ్యాం నిర్మించడంతో రైతులకు సాగునీటి బెంగతీరింది.
ఘనపూర్ ప్రాజెక్టు పరిధిలో మహబూబ్నహర్, ఫత్తేనగర్ కాలువల ద్వారా చివరి ఆయకట్టుకూ సాగునీరందించడానికి సిమెంట్ లైనింగ్ పనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం 2015-16లో రూ.23 కోట్లు కేటాయించింది. 2017-18లో రూ.21 కోట్లు కేటాయించింది. మహబూబ్నహర్ కాలువ 43.68 కిలోమీటర్ల పరిధిలో 32 కిలోమీటర్ల వరకు పనులు పూర్తి చేసింది. 2016లో అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్రావు, అప్పటి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డితో కలిసి హవేళీఘనపూర్ మండలం ముత్తాయిపల్లి శివారు వద్ద మహబూబ్నహర్ కెనాల్ను పరిశీలించారు. కొల్చారం, మెదక్ మండలాల్లో పనులు పూర్తి కాగా, హవేళీఘనపూర్ మండలం శాలిపేట నక్కవాగ వద్ద సిమెంట్ లైనింగ్ పనులు నిలిచిపోయాయి. దీంతో నీటి పారుదల శాఖ అధికారులు ఎంఎన్, ఎఫ్ఎన్ కాలువల సిమెంట్ లైనింగ్ పనుల కోసం రూ.55 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 2022 బడ్జెట్లో రూ.50.35 కోట్లు ఎంఎన్, ఎఫ్ఎన్ కాలువల సిమెంట్ లైనింగ్ పనులకు కేటాయించారు. ఇందులో 10 కిలోమీటర్లు సిమెంట్ లైనింగ్ పనులకు రూ.21 కోట్లు కేటాయించారు. ఈ పనులు హవేళీఘనపూర్ మండలం శాలిపేట నుంచి పోచారం డ్యాం వరకు పూర్తయ్యాయి. హవేళీఘనపూర్ మండలం శాలిపేట, బిబిపూర్, ముత్తాయికోట, సర్ధన, ఫరీద్పూర్, జక్కన్నపేట, పోచమ్మరాల్ వరకు నీళ్లు అందుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం మెదక్ నియోజకవర్గంలో 25 రైతు వేదికలను ఏర్పాటు చేసింది. ఇక్కడ రైతులకు వ్యవసాయానికి సంబంధించిన సలహాలు, సూచనలు వ్యవసాయ శాఖ అధికారులు ఇస్తున్నారు. ప్రతి ఐదు ఎకరాలకు ఒక క్లస్టర్గా విభజించి రైతు వేదికలు నిర్మించారు. 24 గంటల పాటు వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండి రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు.
సీఎం కేసీఆర్ మానస పుత్రిక మిషన్ భగీరథ. ఈ పథకంలో మెదక్ జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో పనులు చేపట్టారు. మెదక్ మున్సిపాలిటీలో సుమారు 70వేల జనాభా ఉండగా, 32 వార్డులకు ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నది. నియోజవర్గంలోని అన్ని మండలాల్లో మిషన్ భగీరథ ట్యాంకులు నిర్మించి, ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ సౌకర్యం కల్పించింది. నీటి కోసం మహిళలకు తిప్పలు తప్పాయి. పానీపట్టు యుద్ధాలు ఆగిపోయాయి. మెదక్ పట్టణంలో సింథటిక్ మైదానం ఏర్పాటు చేసి క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఇటీవల మెదక్కు మెడికల్ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది.ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్కు రింగ్రోడ్డును మంజూరు చేశారు.
మెదక్ నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో రూ.40 0 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.462 కోట్లు, ఆర్అండ్బీ శాఖ రూ.305 కోట్లతో రోడ్ల మరమ్మతులు, బీటీ రెన్యువల్స్ పనులను పూర్తిచేశారు. గిరిజన ప్రాంతాల రోడ్లకు రూ.44 కోట్లు, పంచాయతీరాజ్ రోడ్లకు రూ.20 కోట్లు, మరో రూ.10 కోట్లు మరమ్మతులు, ఇంకో రూ.10 కోట్లు బీటీ రెన్యువల్స్కు, వీటితో పాటు ఆర్అండ్బీ రోడ్లకు రూ.24 కోట్లు కేటాయించింది. మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి 765 డీజీ పనులు ప్రభుత్వం చేపడుతున్నది. మెదక్-సిద్దిపేట ఒక బిట్టుగా, సిద్దిపేట -ఎల్కతుర్తి వరకు రెండో బిట్టుగా రహదారిని విభజించారు. సిద్దిపేట – ఎల్కతుర్తి 63.641 కిలోమీటర్ల రహదారికి రూ.578.85 కోట్లు, మెదక్ నుంచి సిద్దిపేట వరకు రహదారి విస్తరణకు 70 కిలోమీటర్ల రూ.882 కోట్లతో ప్రభుత్వం పనులు చేపడుతున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ మెదక్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో రూపురేఖలు మారిపోయాయి. మెదక్ జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత మెదక్లోనే నూతన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, వంద పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. మెదక్ నియోజకవర్గంలో మెదక్ మున్సిపాలిటీ, రామాయంపేట మున్సిపాలిటీలకు పెద్దఎత్తున నిధులు మంజూరయ్యాయి. గతంలో పట్టణాలతో పాటు గ్రామాలు అంతగా అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం వేయడంతో నివాస ప్రాంతాలు దుర్గంధభరితంగా ఉండేవి. రోడ్లకు ఏండ్ల తరబడి మరమ్మతులు చేయకపోవడంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. సీఎం కేసీఆర్ పట్టణాలతో పాటు పల్లెలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడంతో అన్ని సమస్యలు పరిష్కారమై నేడు సరికొత్తగా దర్శనమిస్తున్నాయి.
మెదక్ ప్రజల చిరకాల కోరికైన మెదక్ రైల్వేలైన్ను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. రైల్వేలైన్ నిర్మాణానికి తన వాటాగా రూ.85.75 కోట్లు మంజూరు చేసింది. ఉమ్మడి ప్రభుత్వాలు రైల్వేలైన్ కోసం శంకుస్థాపన చేసి వదిలిపెట్టగా, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెదక్-అక్కన్నపేట రైల్వేస్టేషన్కు 17 కిలోమీటర్ల మేర నిధులు మంజూరు చేసి త్వరితగతిన పూర్తి చేసింది. రైల్వేలైన్ కోసం 900 మంది రైతులు 370 ఎకరాల భూములను ఇవ్వగా, భూ సేకరణ కోసం ప్రభుత్వం రూ.16.84 కోట్లు నష్టపరిహారం అందించింది. మెదక్-అక్కన్నపేట మార్గంలో మూడు స్టేషన్లు ఉండగా, రామాయంపేట మండలం లక్ష్మాపూర్, హవేళీఘనపూర్ మండలంలోని శమ్నాపూర్తో పాటు జిల్లా కేంద్రం మెదక్లో రైల్వేస్టేషన్లు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిల సహకారంతో మెదక్-అక్కన్నపేట రైల్వేస్టేషన్ రూపుదిద్దుకున్నది. దీంతో, మెతుకు సీమ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మెదక్ రైల్వే స్టేషన్ పనులకు సంబంధించి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఎప్పటికప్పుడు రైల్వే శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించి రైల్వే పనులు త్వరగా పూర్తి చేయించి మెదక్ వాసులకు రైలు ప్రయాణం అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం నిత్యం రైళ్లు తిరుగుతున్నాయి.