కౌడిపల్లి, మార్చి 19: ఈదురు గాలులకు ఇంటి పైకప్పు రేకులతోపాటు ఆరేండ్ల చిన్నారి సంగీత ఎగిరిపోయి పక్కింటి స్లాబ్పై పడింది. దీంతో గాయాలైన చిన్నారికి దవాఖానలో చికిత్స అందిస్తుండగా, పరిస్థితి విషమించి మృతిచెందింది. ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేట జాజితండాలో చోటు చేసుకున్నది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం మంజుల, మాన్సింగ్ దంపతులకు సంగీత, సీత అనే కవలలు ఉన్నారు. సంగీత (6) ఒకటో తరగతి చదువుతుంది. సోమవారం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా, నానమ్మతో కలిసి సంగీత, సీత ఇంట్లోనే రేకులకు ఉయ్యాల కట్టుకుని ఆడుకుంటూ ఉన్నారు. కొద్దిసేపటికి నాన్నమ్మ, సీత ఇద్దరూ పక్కింట్లోకి వెళ్లారు. అంతలోనే భారీ గాలిదుమారం వచ్చి, రేకులతోపాటు చిన్నారి సంగీత ఎగిరిపోయి రెండు ఇండ్ల తర్వాత ఉన్న స్లాబ్పై పడింది. ఇది గమనించిన స్థానికులు తీవ్రగాయాలతో పడిఉన్న చిన్నారిని 108లో నర్సాపూర్ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం సంగీత మృతిచెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బాధిత కుటుంబాన్ని నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి పరామర్శించారు. కుటుంబానికి తనవంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఆయనవెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సార రామాగౌడ్ తదితరులున్నారు. మాలోత్ సంగీత కుటుంబాన్ని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్ తండాలో పరామర్శించి, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వపరంగా ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనవెంట గిరిజన విద్యార్థి సంఘం నర్సాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు శివాజీ నాయక్, స్థానిక తాజా మాజీ సర్పంచ్ రమేశ్, వాల్య నాయక్, మహేశ్, రాజు, రాకేశ్, గోపి, పాండు, గేమ్య నాయక్, సూర్య, శీను ఉన్నారు.