సంగారెడ్డి జిల్లాలో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరందించి.. బీడు భూముల్లో సిరుల పంటలు పండిచడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతలను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రూ. 1774 కోట్లతో నిర్మించనున్న బసవేశ్వర పనులకు గత ఫిబ్రవరిలో ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి శంకుస్థాపన చేయగా, రూ.2653 కోట్లతో చేపట్టనున్న సంగమేశ్వర ఎత్తిపోతల పనులను రేపు మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్తో కలిసి మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను మల్లన్నసాగర్, అక్కడి నుంచి మంజీరాకు తరలించి జహీరాబాద్ మండలం హోతి(కె), మునిపల్లి మండలంలోని చిన్నచెల్మెడలో నిర్మించనున్న రెండు పంప్హౌస్ల ద్వారా ప్రధాన, డిస్ట్రిబ్యూటరీ కాల్వల నుంచి జహీరాబాద్, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగునీరందించనున్నారు. ఇందుకోసం 12టీఎంసీల నీటిని ప్రభుత్వం కేటాయించింది. భూమిపూజ సందర్భంగా శనివారం చిన్నచెల్మెడలో బహిరంగ సభ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సాగునీటి కోసం దశాబ్దాలుగా తపించిన సంగారెడ్డి జిల్లా రైతుల కల సాకారం కానున్నది. మరికొన్ని రోజుల్లో గోదావరి జలాలు జిల్లాను ముద్దాడనున్నాయి. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు మంజూరు చేశారు. ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా నారాయణఖేడ్, అందోలు, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టుకు తరలిస్తారు. సింగూరు ప్రాజెక్టు ఆధారంగా సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలు నిర్మించి జిల్లాను సస్యశ్యామలం చేస్తారు. గతేడాది ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఎత్తిపోతల పథకాలకు నారాయణఖేడ్లో శంకుస్థాపన చేశారు.
సంగారెడ్డి, (నమస్తే తెలంగాణ)/ మునిపల్లి, ఏప్రిల్ 27: బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. రూ.1774 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపడుతున్నది. నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలు సాగునీరందించే ఈ ఎత్తిపోతల పనులను గత ఫిబ్రవరిలో ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. నిర్మాణ పనులను శనివారం మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామంలో మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకంలో భాగంగా చిన్నచెల్మెడలో పంప్హౌస్ నిర్మించనున్నారు. దీనికోసం 35 ఎకరాల భూమి అధికారులు సేకరించారు. పంప్హౌస్ నిర్మాణ పనుల్లో మంత్రి హరీశ్రావుతో పాటు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా చిన్నచెల్మెడలో బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జహీరాబాద్, అందోలు నియోజవర్గాలకు చెందిన
ప్రజాప్రతినిధులు, ప్రజలు, రైతులు కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. కలెక్టర్ శరత్ ఇటీవల ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో సమావేశమై భూమిపూజ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
సాగునీరు లేక దశాబ్దాలుగా బీడు మారిన భూముల్లోకి సంగమేశ్వర ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలు తరలిరానున్నాయి. సంగమేశ్వర ఎత్తిపోతల ద్వారా జహీరాబాద్ నియోజకవర్గంలోని 115 గ్రామాల్లోని 1,03,259 ఎకరాలకు సాగునీరు అందనున్నది. న్యాల్కల్ మండలంలోని 20 గ్రామాల పరిధిలోని 21,880 ఎకరాలు, ఝరాసంగం మండలంలోని 34 గ్రామాల పరిధిలోని 24,535 ఎకరాలు, మొగుడంపల్లి మండలంలోని 15 గ్రామాల్లోని 23,000 ఎకరాలు, జహీరాబాద్ మండలంలోని 21 గ్రామాల పరిధిలోని 22,415 ఎకరాలు, కోహీర్లోని 15 గ్రామాలకు చెందిన 11,429 ఎకరాలకు సాగునీరు అందనున్నది. అందోలు నియోజకవర్గంలోని రాయికోడ్, మునిపల్లి మండలాల్లోని 65,816 ఎకరాలు సంగమేశ్వర ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందనున్నది. రాయికోడ్ మండలంలోని 34 గ్రామాల్లోని 29,940 ఎకరాలు, మునిపల్లి మండలంలోని 32 గ్రామాల పరిధిలోని 35,876 ఎకరాలకు సాగునీరు అందనున్నది. సంగారెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలోని 49,925 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. సదాశివపేట మండలంలోని 27 గ్రామాల్లోని 37,525 ఎకరాలు, కొండాపూర్ మండలంలోని 13 గ్రామాలకు చెందిన 8730 ఎకరాలు, సంగారెడ్డి మండలంలోని ఆరు గ్రామాల్లోని 2435 ఎకరాలు, కంది మండలంలోని నాలుగు గ్రామాల్లోని 1235 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం త్వరగా పూర్తయి తమ పొలాలకు సాగునీరు రావాలని రైతులు వేయి కండ్లతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. గోదావరి జలాలతో బీడుమారిన భూములన్నీ పచ్చబడతాయి. రైతుల ఇంట సిరులు పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దశాబ్దాల సాగునీటి బాధలు తీరుతాయి. ఇంత పెద్ద ప్రాజెక్టు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు జిల్లా రైతుల తరపున కృతజ్ఞతలు. తెలంగాణలో వ్యవసాయం పండుగలా మారింది. సీఎం కేసీఆర్ రైతుబిడ్డ కాబట్టే రైతులకు అనేక పథకాలు అమలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకొని అర్థికంగా ఎదగాలి. దేశమే గర్వపడేలా కేసీఆర్ పాలన సాగిస్తున్నారు. గోదావరి జలాలు వస్తే సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలంగా మారుతుంది. కరువు కాటకాలు, వలసలు ఉండవు.
– చంటి క్రాంతికిరణ్, అందోల్ ఎమ్మెల్యే
సంగమేశ్వర ఎత్తిపోతలు పూర్తయితే ప్రతి రైతు రెండు పంటలు పండించేందుకు పుష్కలంగా సాగునీరు అందుబాటులో వస్తుంది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణంతో భూములన్నీ పచ్చబడతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్కు రైతులంతా రుణపడి ఉంటారు. రైతుల ఆకాంక్షలను నిజం చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదే. రానున్న రోజుల్లో జిల్లాలో బంగారు పంటలు పండుతాయి.
– మీనాక్షి సాయికుమార్, మునిపల్లి జడ్పీటీసీ
ఉమ్మడి రాష్ట్రంలో రైతులు అనేక అవస్థలు పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులను రాజుగా చూడాలన్నదే సీఎం కేసీఆర్ ఏకైక లక్ష్యం. మునిపల్లి మండలంలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తిపోతల పథకాన్ని మావద్ద ఏర్పాటు చేస్తుండడంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఎంతో లాభం చేకూరుతుంది. బీఆర్ఎస్ సర్కారుకు మేమంతా రుణపడి ఉంటాం.
– శైలజా శివశంకర్, మునిపల్లి ఎంపీపీ
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగమేశ్వర ఎత్తిపోతల పథకం సంగారెడ్డి జిల్లా రైతుల పాలిట వరంగా మారనున్నది. జహీరాబాద్, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాలకు సాగునీరు అందనున్నది. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు తరలిరానున్నాయి. మంజీరా ప్రాజెక్టుకు వచ్చే గోదావరి జలాలు ఎత్తిపోసేందుకు వీలుగా జహీరాబాద్ నియోజకవర్గంలో మంజీరా నది సమీపంలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ప్రభుత్వం రూ.2653 కోట్లతో నిర్మించనున్నది. దీనిద్వారా జహీరాబాద్, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 11 మండలాల పరిధిలోని 231 గ్రామాలకు సాగునీరు అందనున్నది. మొత్తం 2.19 లక్షల ఎకరాలకు సాగునీరందనున్నది. ఈ ఎత్తిపోతలకు మల్లన్నసాగర్ నుంచి 12 టీఎంసీల నీటిని ప్రభుత్వం కేటాయించింది. జహీరాబాద్ మండలం హోతి(కె), మునిపల్లి మండలంలోని చిన్నచెల్మెడలో రెండు పంప్హౌస్లు నిర్మిస్తారు. రెండు పంప్హౌస్లతో పాటు ఇతర అవసరాల కోసం ప్రభుత్వం 113 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని గుర్తించింది. 240 కిలోమీటర్లతో 12 ప్రధాన కాల్వలు, 1100 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూటరీ కాల్వలను నిర్మించనున్నారు. పంప్హౌస్ల నిర్మాణం, ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం కోసం మొత్తం 6727
ఎకరాల భూమి ప్రభుత్వం భూసేకరిస్తున్నది.