రాయపోల్, ఏప్రిల్ 30: రాష్ట్రంలో రివర్స్ గేరులో రేవంత్ పాలన కొనసాగుతున్నదని, కేసీఆర్ అమలు చేసిన పథకాలు పేదలకు అందకుండా నాడు ఓటుకు నోటు, నేడు ఓట్లకు ఒట్లు పెట్టుకుంటూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు తిరుగుతున్నారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం రాత్రి రాయపోల్, దౌల్తాబాద్ మండలాల్లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి రోడ్షోల్లో పాల్గొని మాట్లాడారు. కొత్త పథకాలు ఏమోగానీ, ఉన్న పథకాలను ఆగం చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరిన కేసీఆర్పై ఇష్టారీతిగా మాట్లాడుతున్నాడని, ఇది పద్ధతేనా అంటూ ప్రశ్నించారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించి రైతులకు సాగు, తాగునీరు, కరెంట్తో పాటు అనేక సంక్షేమ పథకాలు అందించిన కేసీఆర్ను అవమానించిన రేవంత్రెడ్డికి ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఆరు గ్యారెంటీల బాండ్ను బౌన్స్ చేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్, నీళ్లు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే వారి అబద్ధాలకు సమర్థించినట్లే అవుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధి కావాలంటే వచ్చిన తెలంగాణను నిలుపుకోవాలనాన్రు. మాయమాటలు చెప్పే రఘునందన్రావుకు మరోసారి దుబ్బాక ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రజలకు ఏమీ చేయలేని బీజేపీ నాయకులు క్యాలెండర్లతో తిరుగుతున్నారన్నారు. బీజేపీ వల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు పెరిగాయాన్నారు. రూ.100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేసి అండగా నిలుస్తానన్న వెంకట్రామిరెడ్డిని గెలిపించి, ప్రశ్నించే గొంతును పార్లమెంట్కు పంపించాలని మాజీ మంత్రి హరీశ్రావు ప్రజలకు పిలుపునిచ్చారు.
కేసీఆర్ చొరవతోనే రాయపోల్ మండలం ఏర్పడిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. కరువు, కాటకాలకు నిలయమైన రాయపోల్ మండలంలో గోదావరి జలాలు పారించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. బీజేపీ నాయకుల మాటలకు మరోసారి ప్రజలు మోసపోకుండా వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎంపీగా గెలిస్తే హరీశన్నతో కలిసి మరింత అభివృద్ధి చేస్తామన్నారు. రాయపోల్ మండలం ఉద్యమాలకు గడ్డ అని, గులాబీ అడ్డా అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
ఓటమిని జీర్ణించుకోలేక తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న రఘునందన్రావుకు భయపడేది లేదని ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. తనపై అక్కసుతో ఫిర్యాదులు చేస్తున్నారని, తన జీవితం తెల్ల కాగితమని పేర్కొన్నారు. 11 ఏండ్లుగా మీతో కలిసి పనిచేశానని, నేడు ఎన్నికయ్యే అవకాశం కల్పించాలన్నారు. రఘనందన్రావు ప్రజలను మోసం చేశాడని, మరోసారి ఓట్ల కోసం వస్తున్నాడని ఆయనను నిలదీయాలన్నారు. ప్రజా సేవ కోసం వచ్చానని, ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే అందుబాటులో ఉండి రుణం తీర్చుకుంటానన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ, ఎంపీపీ కల్లూని అనితాశ్రీనివాస్, జడ్పీటీసీ యాదగిరి, సోలిపేట సతీశ్రెడ్డి, వెంకటనర్సింహరెడ్డి, చిందం రాజ్కుమార్, కత్తి కార్తీకగౌడ్, ఇప్ప దయాకర్, దౌల్తాబాద్ మండలాధ్యక్షుడు రహిమొద్దీన్, ఎంపీపీ సంధ్య, జడ్పీటీసీ రణం జ్యోతి, సమన్వయ కర్త రణం శ్రీనివాస్ గౌడ్, రెండు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.