సిద్దిపేట, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాసంగి సాగులో వరినాట్లు పడ్డాయి.. ఇతర పంటల సాగు పూర్తయింది. మరో నెలన్నర అయితే పంటలు చేతికి వస్తాయి.. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం ఇంకా వేస్తూనే ఉన్నది. గత కేసీఆర్ ప్రభుత్వంలో యాసంగి పంట పెట్టుబడి సంక్రాంతి పండుగలోపు రైతులందరికీ (రైతుబంధు) వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతులకు ఇబ్బందులు తెచ్చింది. యాసంగిలో పంటల సాగు కోసం రైతుల చేతిలో డబ్బులు లేక.. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం బ్యాంకులో జమచేయక.. రైతులు వడ్డీ వ్యాపారుల బాట పట్టారు. వ్యాపారుల వద్ద వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని యాసంగి పంటలు సాగు చేశారు. డిసెంబర్, జనవరి నెలలు పోయి ఫిబ్రవరిలో 12 రోజులు గడిచినా ఇంతవరకు రైతులందరికీ పంట పెట్టుబడి సాయం రాలేదు. దీంతో సీఎం రేవంత్రెడ్డిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు మూడు ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతుబంధు పడింది. ఇదేమిటి ఎంత మందికి జిల్లాలో రైతుబంధు పడింది. ఆ వివరాలు ఇవ్వండి అని వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే ఆ వివరాలు అడగవద్దు.. అని దాటవేస్తున్నారు. ఇదేంటి అని అడిగితే అది అంతే అని సమాధానం చెబుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎకరాల వారీగా రైతుబంధు పదిహేను, నెల రోజుల్లో రైతులందరికీ ఇచ్చారు. ఏ రోజుకు ఆరోజు ఎంతమంది రైతులకు వేశాం.. ఎన్ని ఎకరాలకు వేశాం.. ఎన్ని కోట్లు వేశాం అని పక్కాగా ప్రతిరోజూ సాయం త్రం వివరాలు తెలియజేశారు. కానీ ఈ ప్రభు త్వం వివరాలు ఇవ్వడం లేదు. కాంగ్రెస్ ప్రభు త్వం ప్రస్తుత యాసంగి సాగుకు సిద్దిపేట జిల్లాలో సుమారుగా 3,50,000 లక్షల మంది రైతులకు రూ. 323 కోట్లు అవసరం కాగా ఇప్పటి వరకు జిల్లాలో 2,45,782 మందికి రూ.153.35 కోట్లను జమచేసింది. మెదక్ జిల్లాలో 2,80,949 మంది రైతులకు రూ. 200.71 కోట్లు అవసరం కాగా 2,28,379 మంది రైతులకు రూ.115.25 కోట్లు జమ చేసింది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 3,62,143 మంది రైతులకు రూ. 375.12 కోట్లు అవసరం కాగా 2,83,376 మంది రైతులకు రూ.165.45 కోట్లు జమ చేసింది.
కేసీఆర్ ప్రభుత్వంలో అడగకుండానే రైతులకు అన్ని చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నింటికి ఎదురుచూపులే కనిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం రెండు పంటలకు ఎకరాకు రూ. 10 వేలు ఇచ్చింది. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ. 15 వేలు ఇస్తానని వాగ్ధానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మొండి చేయి చూపుతోంది. యాసంగి సాగుకు పంట పెట్టుబడి సాయాన్ని ఇంతవరకు పూర్తిగా రైతులకు అందలేదు.
రైతుబంధు ప్రారంభించినప్పటి నుంచి గత వానకాలం వరకు (11వ విడత ల్లో) సిద్దిపేట జిల్లాలో 29,33,494 మంది రైతులకు రూ. 3,124.82 కోట్లు, మెదక్ జిల్లాలో 24,69,637మంది రైతులకు రూ.2,027.37 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 31,95,960 మంది రైతులకు రూ. 3,619.54 కోట్లు, మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో 85,99,091 మంది రైతులకు రూ. 8,771.73 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో గత కేసీఆర్ ప్రభుత్వం జమ చేసింది.
కాంగ్రెస్ సర్కారు రైతుభరోసా ఇప్పట్లో అమలు చేసేలా లేదు. రైతుబంధు పెట్టుబడి సాయం అందక మక్క పంటేసుకున్న. రైతుబంధు వస్తదనుకుని కండ్లుకాయలు కాసేలా ఎదురుచూసిన. యాసంగి సీజన్ అయిపోవట్టే. కూరగాయలు సాగుచేసుకుని మంచిగా దిగుబడి సాధిద్దామనుకున్న. నా ఆశలు ఆడియాలు అయ్యాయి. మూడెకరాలు పైగా ఉన్న రైతులకు రైతుబంధు ఇంకా పడలేదు. నాకు 4.36 ఎకరాల పొలం ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు టైమ్కు రైతుబంధు పైసలు పడేటివి.కాంగ్రెస్ సర్కారు వచ్చినంక రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
నాకు మూడెకరాల భూమి ఉంది. ఇప్పటి వరకు రైతుబంధు డబ్బులు పడలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యాసంగి సీజన్కు రైతుబంధు డబ్బులు ఏస్తదో.. లేదో.. అన్న అనుమానం ఉన్నది. రెండు నెలలైన నాకు రైతుబంధు డబ్బులు పడలే. కేసీఆర్ సర్కార్ మాత్రం రైతులకు ఎప్పటికప్పుడే అకౌంట్లల్ల డబ్బులు వేసేది. రైతులు పెట్టుబడి సహాయం కోసం ఎనకటి లెక్కనే మల్ల అప్పులు తెచ్చుడే అవుతుంది. గిట్లయితే రైతులకు మల్ల కష్టాలు మొదలైనట్లే.
నిజాంపేట గ్రామంలో నాకు 4 ఎకరాల 20 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అందులో పదేండ్ల సంది వరి సాగుచేస్తున్న. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏనాడు పంట పెట్టుబడులకు ఇబ్బంది కాలేదు.నాకు రూ.22,500 రైతుబంధు పైసలు నా బ్యాంక్ అకౌంట్లోకి పడుతుండే.ఆ పైసలతో ఎరువులు,విత్తనాలు కొనగా మిగిలిన పైసలను నాటువేసిన కూలీలకు ఇస్తుంటి. కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చి 2నెలలు కావస్తున్నా ఇప్పటికీ నాకు రైతుబంధు పైసలు జమకాలే. మళ్లా అప్పులు జేయాల్సి అస్తున్నది.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడూ రైతుబంధు టైంకు వచ్చేది. కాంగ్రెస్ సర్కారు అచ్చినంక రైతులకు కష్టాలకు మొదలయ్యాయి. నాకు 4.22 ఎకరాల భూమి ఉంది. ఇంతవరకు నాకు రైతుబంధు రాలేదు. కేసీఆర్ ఎన్నికలకు ముందు రైతుబంధు వేస్తామంటే వాళ్లు కాంగ్రెసోళ్లు అడుడ్డుకున్నరు. రెండు నెలలు గడిచినా పెట్టుబడి సహాయం లేదు. ఇట్లయితే మళ్లీ పాత రోజులు అస్తయి.
రైతులు పంటలు పండించేందుకు కరెక్టు టైమ్కు రైతుబంధు ఇయ్యాలి. నా పేరు మీద 5.8 ఎకరాల భూమి ఉంది. ఇంతకు ముందు ఏడాదికి రెండు సార్లు 26వేల రూపాయల రైతుబంధు టైమ్కు నాకు వచ్చేది. ఈసారి ఇంతవరకు రాలేదు. ఎన్నికలు అయిపోయి రెండు నెలలు అయిపాయే. ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించాలి.
మాఊరు శివారులో నాకు 3.09 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. బీఆర్ఎస్ సర్కారులో రూ.16 వేల రైతుబంధు వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఇస్త్తది అనుకున్న. కానీ, ఇప్పటి వరకు రైతుబంధు ఇవ్వలే. రైతుబంధు సకాలంలో వస్తే వ్యవసాయ పనులకు ఉపయోగపడేవి. మాజీ సీఎం కేసీఆర్ రైతులను కంటికి రెప్పలాగా కాపాడుకున్నారు. సకాలంలో రైతుబంధు బ్యాంకు జమచేసి ఆదుకున్నాడు. బీఆర్ఎస్ హయాంలో రైతులు సంబురంగా వ్యవసాయ పనులు చేసుకున్నారు.పుట్లకొద్ది వరి ధాన్యం పండింది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు రైతులకు వ్యతిరేకంగా ఉంది.