విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచలో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీరంగనాయకస్వామి బీఫార్మసీ కళాశాలను సోమవారం విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. బీఫార్మసీ కళాశాల ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపేందుకు ప్రభుత్వం పోటీ పడుతుంటే, ప్రతిపక్షాలు తిట్టడంలో పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు. సిద్దిపేట ఒక్కటే కాదు తెలంగాణలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నామని, 24గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఐటీతో పాటు వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేశామన్నారు. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తొమ్మిదేండ్లలో 1000 గురుకులాలు ఏర్పాటు చేసి ఎకడా లేని విధంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు.
– సిద్దిపేట, సెప్టెంబర్ 11
సిద్దిపేట, సెప్టెంబర్ 11: “ విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, సిద్దిపేట విద్యాక్షేత్రంగా విరాజిల్లుతున్నది… మెడికల్, అగ్రికల్చర్, వెటర్నరీ, ఫార్మసీ, నర్సింగ్ కళాశాలలు ఇలా అన్ని రకాల విద్య సిద్దిపేటలో అందుబాటులోకి వచ్చింది. మెడికల్ చదువులకు సిద్దిపేట కేంద్రంగా మారింది” అని అర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచలో సోమవారం ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ రంగనాయక స్వామి బీఫార్మసీ కళాశాలను విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గంలో బీఫార్మసీ కళాశాల ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎనిమిది నెలల్లో అన్ని రకాల అనుమతులు తీసుకొని ఈ సంవత్సరం కాలేజీని ప్రారంభించుకోవడం గొప్ప విషయమన్నారు. ఫార్మసీ కళాశాల ప్రారంభోత్సవానికి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి రావడం సంతోషంగా ఉందన్నారు.
సిద్దిపేట ఒక్కటే కాదు తెలంగాణలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మూడు శాతం జనాభా ఉన్న రాష్ట్రంలోని గ్రామాలకు 30 శాతం, పట్టణాలకు 20 శాతం అవార్డులు వచ్చాయన్నారు. దేశంలోనే తెలంగాణ నేడు ధాన్యం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉందన్నారు. డాక్టర్లలో కూడా తెలంగాణ నెంబర్వన్గా ఉన్నదని, ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ ఐటీ అని మాత్రమే అనేవారు, ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో హైదరాబాద్లో ఐటీతో పాటు గ్రామాల్లో వ్యవసాయం కూడా అభివృద్ధి చెందుతున్నదన్నారు. ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ నెంబర్వన్గా ఉందన్నారు.
తెలంగాణ వచ్చినప్పుడు మూడు లక్షల ఐటీఉద్యోగాలు ఉంటే ఈరోజు 10లక్షల ఉద్యోగాలకు తెలంగాణ నిలయంగా మారిందన్నారు. హైదరాబాద్ నగరంలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో.. అదేవిధంగా మారుమూల గ్రామంలో కూడా అవే సౌకర్యాలు తెలంగాణ ప్రభుత్వం కల్పించిందన్నారు. దేశంలో విద్యుత్ కోతలు లేకుండా 24 గంటలు సరఫరా చేసే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని, ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్లో విద్యుత్ కోతలు, దేశ రాజధాని ఢిల్లీలో విద్యుత్ కోతలు, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలైన కర్ణాటక, రాజస్థాన్లో కూడా 24 గంటల విద్యుత్ ఇవ్వలేకపోతున్నారన్నారు. దేశంలో అతి ఎకువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని గుర్తుచేశారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర భాగాన నిలిపేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పోటీ పడుతుంటే ప్రతిపక్షాలు తిట్టడంలో పోటీ పడుతున్నాయన్నారు. ఇదే అభివృద్ధి స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు.ప్రజల సేవలో మరింత ముందుండి పనిచేస్తామన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. హైదరాబాద్లో మాత్రమే జరిగే ఎగ్జిబిషన్లను ఇక నుంచి అన్ని జిల్లాల్లో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ సారి కరీంనగర్ జిల్లాను ఎంచుకున్నట్లు తెలిపారు. మహిళా విద్యాభివృద్ధికి ఎగ్జిబిషన్ సొసైటీ ఎంతగానో కృషి చేసిందని, ఎంతో మందికి విద్య,ఉపాధి కల్పిస్తున్నదన్నారు
తెలంగాణకే సిద్దిపేట మోడల్
అభివృద్ధితో పాటు అన్ని కార్యక్రమాలకు సిద్దిపేట నియోజకవర్గం తెలంగాణకే మోడల్ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగనాయకస్వామి బీఫార్మసీ కాలేజీ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇంతటి గొప్ప కార్యక్రమంలో ప్రేమతో నన్ను భాగస్వామ్యం చేసిన మంత్రి హరీశ్రావుకు ధన్యవాదాలు తెలిపారు. బీఫార్మసీ కాలేజ్ అన్ని అనుమతులు పొంది ఈరోజు ప్రారంభించుకోవడం అంటే దాని వెనుక మంత్రి హరీశ్రావు కృషి ఎంతో ఉందన్నారు. దేశమంతా అభివృద్ధిలో తెలంగాణనే మోడల్ అని చెప్తుంటే… తెలంగాణకే సిద్దిపేట మోడల్గా నిలిచిందన్నారు. మంత్రి హరీశ్రావు ఇప్పుడే కాదు ఉద్యమ సమయంలో కూడా ఎకడ ఏ నిరసన కార్యక్రమం జరిగినా పాల్గొన్నారన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఏదైతే ఆరాటం, తపన ఉండేదో ఇప్పుడు అభివృద్ధిలోనూ అదే నిబద్ధతతో మంత్రి హరీశ్రావు పనిచేస్తున్నారన్నారు. సిద్దిపేటలో హరీశ్రావు మెజార్టీతో ఎవరూ పోటీ పడే పరిస్థితిలో లేరన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీటు పీజీ విద్యను ఇంప్లిమెంట్ చేసేందుకు మేమంతా కృషి చేస్తున్నామన్నారు. తొమ్మిదేండ్లలో 1000 గురుకులాలు ఏర్పా టు చేసి దేశంలోనే ఎకడా లేని విధంగా నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. తొమ్మిదేండ్లలో 1450 గురుకుల జూనియర్ కాలేజీలు, 85 డిగ్రీ కాలేజీలు, ఐదు పీజీ కాలేజీలు, నాలుగు లా కాలేజీలు, నాలుగు ఇంజినీరింగ్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. నేడు 60శాతం మంది బాలికలు గురుకులాల్లో చదువుకుంటున్నారన్నారు. బాలికలు ఉన్నత విద్యతో పాటు ఉద్యోగావకాశాలు పొందడం సంతోషంగా ఉందన్నారు.
నేడు యూనివర్సిటీల్లో 70శాతం మంది అమ్మాయిలు విద్యను ఆభ్యసిస్తున్నట్లు తెలిపారు. మహిళా విద్య కోసం ముందు నుంచిపాటుపడే ఎగ్జిబిషన్ సొసైటీకి మంత్రి అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేశారన్నారు. ఆడపిల్లల చదువుకు ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఏదైనా సమస్య ఉందంటే మాకు వెంటనే గుర్తుకు వచ్చేది మంత్రి హరీశ్రావు అన్నారు.అభివృద్ధిని కాంక్షించే వారు ప్రభుత్వానికి అండగా ఉండలన్నారు. కార్యక్రమంలో బీఫార్మసీ కాలేజీ సొసైటీ అధ్యక్షుడు ప్రభాశంకర్, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు దేవేందర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, సర్పంచ్ సంతోషి విక్రమాదిత్య, ఎంపీటీసీ ఎడ్ల వెంకటలక్ష్మీయాదవరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.