శాంతి, ప్రేమ, అహింస, పరోపకారం, సోదరాభావాన్ని సందేశంగా అందించే పవిత్ర స్థలం. అవనిపై అవతరించిన కరుణామయుడిని ఆరాధించే ప్రార్థనా మందిరం. ప్రశాంతతకు నిలయం.. కరువు కాలంలో అన్నార్థులను ఆదుకున్న అమృతహస్తం.. నిరుపమాన సేవలకు నిలువెత్తు నిదర్శనం.. విదేశీ నైపుణ్యం, కళాత్మక నిర్మాణ కౌశలంతో కనువిందు చేసే అత్యద్భుత కట్టడం.. ఎల్లలు దాటి సందర్శకులను ఆకర్షిస్తూ పర్యాటక కేంద్రంగా దినదిన ప్రవర్తమానమవుతున్న ప్రముఖ పర్యాటక కేంద్రం. అతి సుందర మందిరంగా.. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చిగా.. రెండో వాటికన్గా పేరుగాంచిన మెదక్ కెథడ్రల్ చర్చి, నిర్మించి 100 వసంతాలైనా ఇప్పటికీ చెక్కుచెదరని అందాలతో సుందర మందిరంగా అలరారుతున్నది. మెతుకుసీమకు తలమానికంగా భాసిల్లుతున్నది. క్రిస్మస్ పండుగకు అందంగా ముస్తాబైంది. నేటి నుంచి మూడురోజుల పాటు మెదక్ చర్చిలో జాతర కొనసాగనున్నది. 99వ క్రిస్మస్ వేడుకల సందర్భంగా 535 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కమాండ్ కంట్రోల్ నుంచి సీసీ కెమెరాల ద్వారా జాతరను పర్యవేక్షించనున్నారు.
CSI Church | మెదక్ (నమస్తే తెలంగాణ)/మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 24: మెదక్లోని చర్చి ఒక అమూల్యమైన చారిత్రక వారసత్వం. ఇది ఆసియా ఖండంలోకెల్లా అతి పెద్దదైన డయాసీసే కాకుండా వాటికన్ తర్వాత ప్రపంచంలోనే పెద్దది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వచ్చిన కరువు సందర్భంగా ఈ చర్చిని నిర్మించారు. చార్లెస్ వాకర్ పోస్నెట్ అనే ఆయన అప్పట్లో ఫాదర్గా ఉండేవాడు. మూడేండ్ల పాటు పీడించిన కరువుకు చలించిన ఆయన 1914లో మెదక్ చర్చి నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. కళాత్మకమైన మెదక్ చర్చి నిర్మాణం పూర్తి చేయడానికి పదేండ్లు పట్టింది. ఒకేసారి 5000 మంది ప్రార్థనలు చేసేలా అతిపెద్ద చర్చి ఇది.
1908లో మెదక్ ప్రాంతంలో తీవ్ర కరువు వచ్చింది. వర్షాలు లేక పంటలు సాగుచేసే పరిస్థితి లేదు. పనులు లేక ఉపాధి కరువైంది. చేసేందుకు పనులు లేక, తినేందుకు తిండి కరువై వేలాది మంది ప్రజలు ఆకలి దప్పులతో అలమటించారు. ఈ పరిస్థితి చూసి ఫాదర్ ఫాస్నెట్ చలించారు. అన్నార్థులను ఆదుకోవాలని తలంచారు. ఏసు ప్రభువుకు పెద్ద ప్రార్థనా మందిరం నిర్మించాలన్న ఆలోచనలో ఉన్న ఫాస్నెట్ ఇటు కరుణామయుడికి ఆలయం నిర్మించడం.. అటు కరువు పీడితుల ఆకలి తీర్చడం లక్ష్యంగా చర్చి నిర్మాణానికి పూనుకున్నాడు. బర్మా నుంచి బియ్యం, ఆహార పదార్థాలు తెప్పించి పనికి ఆహారం ప్రతిపాదికన చర్చిని నిర్మించారు. 1910లో మొదలైన చర్చి నిర్మాణం 1924 వరకు కొనసాగింది. అంతకాలం ఎంతోమందికి చేతి నిండా పని దొరికింది.
మెదక్ చర్చిని 180 అడుగుల ఎత్తుతో నిర్మించాలని ఫాదర్ ఫాస్నెట్ తలంచి అనుమతి కోసం నిజాం ప్రభువుకు దరఖాస్తు సమర్పించారు. నిజాం రాజ చిహ్నంగా ఉన్న హైదరాబాద్లోని చార్మినార్ ఎత్తు 175 అడుగులు కాగా, అంతకంటే ఎక్కువ ఎత్తులో చర్చి నిర్మించేందుకు అనుమతించలేదు. దీంతో 173 అడుగుల ఎత్తుతో చర్చి నిర్మించేందుకు ఫాస్నెట్ నిర్ణయించారు. చర్చి ప్రధాన గోపురం ఎత్తు 173 అడుగులు కాగా, వెడల్పు 100 అడుగులు, పొడువు 200 అడుగులు ఉంది. మెదక్ చర్చిని పూర్తిగా రాతితో డంగు సున్నం వినియోగించి ఎంతో పటిష్టంగా నిర్మించారు.
మెదక్ చర్చి నిర్మాణంలో నేటి ఇంజినీర్ల ఊహకందని నిర్మాణ నైపుణ్యాలు ఒక ప్రత్యేకత అయితే, అద్దాల కిటికీలు మరో ప్రత్యేకత. క్రీస్తు జీవితంలోని ప్రధాన ఘట్టాలను ఎంతో కళాత్మకంగా కండ్లకు కట్టేలా అద్దాల కిటికీల్లో పొందుపర్చడం విశేషం. ఇంగ్లాండ్కు చెందిన ప్రముఖ చిత్రకారుడు ‘ఓ సాలిస్ బరి స్టెయిన్’ గ్లాస్ ముక్కలతో ఈ కిటికీలకు రూపకల్పన చేశారు. మూడు దశల్లో వీటిని ఏర్పాటు చేశారు. ముందుగా 1927లో చర్చిలో ఎదురుగా ఉన్న వేదికపై ఉన్న కిటికీ అద్దాల్లో క్రీస్తు ఆరోహణకు సంబంధించిన దృశ్యాలు పొందుపర్చారు. ఆ తర్వాత 1947లో చర్చిలో కుడివైపున ఉన్న కిటికీ అద్దాల్లో ఏసు ప్రభువు జననానికి సంబంధించిన దృశ్యాలు, 1958లో క్రీస్తు శిలువపై వేలాడుతున్న దృశ్యాలు పొందుపర్చారు. బయటి నుంచి సూర్యకాంతి ప్రసరించినప్పుడు మాత్రమే చర్చిలోపల నుంచి చూస్తే కిటికీ అద్దాల్లో నిక్షిప్తమైన దృశ్యాలు కనిపించడం వీటి ప్రత్యేకత.
ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చిని మెదక్ పట్టణంలో అద్భుతమైన నైపుణ్యంతో నిర్మించారు. ఏసుక్రీస్తు కొలువైన మహాదేవాలయంగా పేరొందిన ఈ చర్చి సందర్శనకు దేశవిదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. మెదక్ జిల్లాకు తలమానికంగా బాసిల్లుతున్న మహాద్భుత కట్టడం మెదక్ కెథడ్రిల్ చర్చి. ఇది కల్లోల జగతికి శాంతి సందేశాన్ని అందించిన కరుణామయుడి మందిరమే కాదు.. అన్నార్థులను ఆదుకునే మహోన్నత ఆశయంతో రూపుదిద్దుకొన్న మహాదేవాలయం. కరువు నుంచి ఉద్భవించిన కళాత్మక కట్టడం. సుందరమైన మెదక్ చర్చికి ఘనమైన చరిత్ర ఉంది. కరుణామయుడి మందిరంలో ఆర్చీలు, పైకప్పు, ఫ్లోరింగ్ మాత్రమే కాదు.. వేదికపై టేబుళ్లు, కుర్చీలు సైతం ఎంతో కళాత్మకంగా ఉంటాయి. ప్రధాన వేదికపై ఉండే ప్రభు భోజనపు టేబుల్ రంగూన్ టేకుతో కళాత్మకంగా తయారు చేయబడింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పఠన వేదిక దేవదారు కర్రతో పక్షిరాజు రూపంలో ఎంతో అద్భుతంగా మలచారు. జెకొస్ల్లోవేకియా దేశానికి చెందిన కలప పనివారు చాలారోజుల పాటు శ్రమించి దీనిని అసలైన పక్షిని తలపించేలా రూపొందించడం వారి పతనానికి నిదర్శనం. గురువులు ఆసీనులయ్యే బల్లలు, కుర్చీలు గులాబీ కర్రతో తయారు చేశారు.
ప్రశాంతతకు నిలయం..
ఆహ్లాదకర వాతావరణంలో మత సామరస్యానికి, ప్రశాంతతకు ప్రతీకగా నిలిచింది మెదక్ చర్చి. ఈ చర్చిని ఇంగ్లాండ్లోని రన్కోల్ పట్టణానికి చెందిన రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్నెట్ నిర్మించారు. ఈ చర్చి నిర్మాణానికి ఆయన టోపీ పట్టుకుని ఇంగ్లాండ్లోని అన్ని ప్రాంతాలు తిరుగుతూ విరాళాలు వసూలు చేస్తుంటే, ఇంగ్లాండ్ దేశస్తులు ఇండియా ఫకీర్ అని, హైదరాబాద్ బిచ్చగాడని వేళాకోలం చేసేవారని చెబుతుంటారు. కేథడ్రల్ నిర్మాణం 1914లో ప్రారంభమై 1924లో పూర్తయింది. యూరప్నకు చెందిన గాథిక్ శైలిలో ఈ మహాలయం నిర్మించబడింది. దక్షిణ, తూర్పు ఆసియా ఖండం నందు ఈ కేథడ్రల్ చర్చి మహోన్నతమైందిగా పేరుగాంచింది. ఈ మహా దేవాలయం శిఖరం ఎత్తు 173 అడుగులు. ఈ దేవాలయం పొడవు 200 అడుగులు, వెడల్పు 100 అడుగులు. ఆ కాలంలోనే రూ.32 లక్షల వ్యయం అయినట్లు అంచనా. 360 ఎకరాల విస్తీర్ణంలో ప్రహరీ మధ్యలో చర్చిని నిర్మించారు. చర్చి ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ) పరిధిలో మొత్తం 22 డయాసిస్లు ఉన్నాయి. అందులో మెదక్ డయాసిస్ ఒకటి. 1947 సెప్టెంబర్ 30న ఇది ఆవిర్భవించింది. దీని పరిధిలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మెదక్ బిషప్లుగా తొమ్మిది మంది చేశారు.
మెదక్ చర్చి భక్తులతో కిక్కిరిసిపోయింది. క్రిస్మస్ ముందు ఆదివారం కావడంతో వేలాది మంది భక్తులు, పర్యాటకులు తరలివచ్చారు. ప్రత్యేక ప్రార్థనల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. చర్చి ప్రేసిబేటరీ ఇన్చార్జి శాం తయ్య దైవ సందేశం వినిపించారు. ప్రార్థనల్లో పాస్టర్లు డేవిడ్, జైపాల్, శ్రీనివాస్, సువర్ణ, చర్చి కమిటీ సభ్యులు గంట సంపత్, శాంసన్ సందీప్, జాన్సన్, గెలెన్ చిత్తరంజన్, జాయ్ముర్రే తదితరులు పాల్గొన్నారు.
1924 డిసెంబర్ 25న క్రిస్మస్ రోజు మెదక్ మహాదేవాలయా న్ని ప్రజలకు అంకితం చేశారు. ఆనాటి నుంచి ప్రతి ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఈ చర్చిలో ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 99వ క్రిస్మస్ వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ వేడుకలు సోమవారం తెల్లవారుజాము నుంచి నిర్వహించనున్నారు. విద్యుద్దీపాలతో చర్చి కాంతులు విరజిమ్ముతున్నది.