చేగుంట, మే11: జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుంచి చక్కటి స్పందన లభిస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఉమ్మడి చేగుంట మండలంలోని పోతాన్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరం, నర్సరీని గురువారం ఆయన సందర్శించారు. కంటి పరీక్షలకు సంబంధించి రికార్డులు, మందులు, కండ్లద్దాలను పరిశీలించారు. కంటి పరీక్షల ఎలా చేస్తున్నారని అక్కడున్న ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 469 పంచాయతీలు,75 మున్సిపల్ వార్డుల్లో ఇప్పట్టి వరకు 395 పంచాయతీలు, 70 వార్డుల్లో ఈ శిబిరాలు నిర్వహించి 3,95,977 మందికి కంటి పరీక్షలు చేసి, 42,498 మందికి రీడింగ్ అద్దాలు, 33,897 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందజేశామన్నారు. ఇప్పట్టి వరకు పరీక్షలు చేసుకున్న వారిలో 3,09,759 మందికి ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారించినట్లు తెలిపారు. ప్రస్తుతం 26 పంచాయతీలు, 3 వార్డుల్లో శిబిరాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ శిబిరాలు జూన్ 15 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
నర్సరీని సందర్శించిన కలెక్టర్
పోతాన్పల్లిలోని గ్రామ నర్సరీని కలెక్టర్ సందర్శించారు. హరితహారంలో ఇంటింటికీ పంపిణీ చేసేందుకు పెంచిన పండ్లు, పూల మొక్కలను పరిశీలించారు. నర్సరీ పెంపకం బాగున్నదని, అన్ని గ్రామాల్లో ఇలాంటి నర్సరీలు తయారు చేయాలని, అవెన్యూ ప్లాంటేషన్కు టేకోమా, గానుగ వంటి మొక్కలు పెంచాలని ఎంపీడీవోకు సూచించారు. కలెక్టర్తో వైద్యాధికారి చందునాయక్, మండల ప్రత్యేక అధికారి జయరాజ్, గ్రామ సర్పంచ్ కారింగుల సంతోష సిద్ధరెడ్డి, తహసీల్దార్ మాలతి, ఎంపీడీవో ఆనంద్మేరి, చేగుంట పీహెచ్సీ డాక్టర్ అనిల్కుమార్, ఏఎన్ఎం గాండ్ల అనురాధ, నవనీత, సంపతి, ఫార్మాసిస్ట్ పగడయ్య, పంచాయతీ కార్యదర్శి, ఆశ కార్యకర్తలు, వార్డు సభ్యులు నరేశ్గౌడ్, శ్రీకాంత్, మధుసూదన్రెడ్డి, నాయకులు రాంరెడ్డి, అంజిరెడ్డి, హరిప్రసాద్ ఉన్నారు.
వడియారంలో కొనుగోలు కేంద్రాన్ని సందర్శన
మెదక్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం చేగుంట మండలం వడియారం గ్రామంలో సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ధాన్యంలో తేమ శాతం, తూకం ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణం పొడిగా ఉందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వేగవంతంగా ధాన్యం కొనాలని సూచించారు. కేంద్రంలో సమస్యలుంటే కలెక్టర్ కార్యాలయంలోని హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేయాలన్నారు. జిల్లాలో 38 బాయిల్డ్ రైస్మిల్లులు ధాన్యం కొంటున్నాయని, మిల్లుకు వచ్చే ధాన్యంలో ఎలాంటి కోతలు విధించొద్దని, ఈ ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకోవాలన్నారు. బాయిల్డ్రైస్ అంటే 68 శాతం రావాలని, కానీ అకాల వర్షాలతో ధాన్యం కాస్త చెడిపోయి, తళ్లు అధికంగా ఉన్నా 60 శాతానికి పైగా వస్తున్నదని, అయినా ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యంలో కొత విధించొద్దని మిల్లర్లను హెచ్చరించినట్లు తెలిపారు. వీఆర్ఏలు మిల్లుల వద్ద ఉండి ధాన్యం వచ్చిన వెంటనే దించుకునేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. గన్నీ సంచులు, లారీల సమస్యలుంటే ఆర్డీవో, తహసీల్దార్లకు తెలిపి, వెంటనే పరిష్కరించుకోవాలన్నారు. టాబ్ ఎంట్రీ కూడా కచ్చితంగా చేసేలా చూడాలన్నారు.
39,451 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
జిల్లాలో 388 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 9,476 మంది రైతుల నుంచి రూ.81 కోట్ల 27లక్షల విలువగల 39,451 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని కలెక్టర తెలిపారు. రూ.17 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని, త్వరలో మిగితా డబ్బులు వేస్తామన్నారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి జయరాజ్, తహసీల్దార్ లక్ష్మణ్బాబు, వ్యవసాయశాఖ అధికారి శోభ, స్థానిక సర్పంచ్ వడ్డెపల్లి తిరుమల నర్సింహులు, ఎంపీటీసీ బక్కి లక్ష్మీరమేశ్, పంచాయతీ కార్యదర్శి, సీఈవోతో పాటు పలువురు రైతులు ఉన్నారు.