అక్కన్నపేట, అక్టోబర్ 20 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో రెండు పర్యాయాలు హుస్నాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి, నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం తొమ్మిదేండ్లలో రూ.9వేల కోట్ల పై చిలుకు నిధులు తీసుకువచ్చానని హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ సృష్టం చేశారు. తనను మళ్లీ ఆశీర్వదించండి.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానంటూ శుక్రవారం మండలంలోని కట్కూరు, దుబ్బాతండా, వంకాయతండా, దాస్తండా, చాపగానితండా, కన్నారం (వేలేరు), ఇచ్చులపల్లి(వేలేరు)లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉద్యమ పార్టీకి ఆయా గ్రామాలు అండగా నిలుస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడోసారి బీఆర్ఎస్కు పట్టం కట్టి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నట్లు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.5649 కోట్లు, ప్రజా సంక్షేమానికి రూ.3427కోట్లు మొత్తంగా రూ.9076 కోట్ల నిధులను తొమ్మిదేండ్లలో తీసుకువచ్చానన్నారు. అక్కన్నపేట మండలానికి సుమారు రూ.500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
మండలంలో చేసిన అభివృద్ధి పనులు కండ్ల ముందు కనబడుతున్నాయన్నారు. ఎన్నికల సమయంలో వచ్చే పార్టీలను నమ్మి మోసపోకూడదన్నారు. కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలకు డిపాజిట్లు దక్కకుండా వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లో జై తెలంగాణ.. జై కేసీఆర్.. కారు గుర్తుకే మా ఓటు అంటూ నినాదాలు చేశారు. మళ్లీ నువ్వే మా ఎమ్మెల్యే అంటూ ఆశీర్వదిస్తూ మహిళలు, వృద్ధులు బొట్టు పెట్టి మంగళహారతులతో గ్రామాల్లోకి స్వాగతం పలికారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, ఎంపీపీ మాలోత్ లక్ష్మీబీలూనాయక్, జడ్పీటీసీ భూక్యా మంగ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెసరు సాంబరాజు, మండల ఇన్చార్జిలు మ్యాక నారాయణ, కాసర్ల అశోక్బాబు, లింగాల సాయన్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, మాజీ జడ్పీటీసీ మాలోత్ బీలూనాయక్, రామచంద్రం, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కందుల రాంరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.