గజ్వేల్, మే 24: సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అత్యాధునిక హంగులతో కోర్టు భవన నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అప్పట్లో కోర్టు భవన నిర్మాణ పనులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయన్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన తర్వాత ప్రారంభంలో పనులు చకచకా సాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కోర్టు భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. శిథిలావస్థలో ఉన్న ప్రస్తుత కోర్టు భవనంలో వర్షాకాలంలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకుంటుందోనని ఉద్యోగులు, సిబ్బంది భయపడుతున్నారు.
బీఆర్ఎస్ హయాంలో నిధులు మంజూరు..
గజ్వేల్ రింగ్రోడ్డు పక్కన కోర్టు నిర్మాణానికి బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ రూ. 29కోట్ల నిధులు మంజూరు చేయడంతో పాటు ఐదెకరాల స్థలాన్ని కేటాయించారు. ఒకే ప్రదేశంలో అత్యధునిక హంగులతో కోర్టు భవనం, జడ్జిల నివాస గృహాలు, బార్ అసోసియేషన్ గది, పోలీసుల విశ్రాంతి గది, కోర్టుకు వచ్చే వారి కోసం భవన నిర్మాణ పనులు 2023లో ప్రారంభించారు. ఏడాది వరకు పనులు చకచకా ముందుకు సాగాయి. కోర్టు భవనం సెల్లార్, జీప్లస్-2 పద్ధ్దతిలో నిర్మాణ పనులు ప్రారంభం కాగా, ప్రస్తుతం స్లాబ్లు పూర్తయ్యాయి.
బిల్లుల మంజూరులో జాప్యంతో కాంట్రాక్టర్ పనులు మధ్యలోనే ఆపేశారు. స్లాబ్ల దశలో ఉన్న భవన పనులు తిరిగి మళ్లీ ప్రారంభం కావాలంటే ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయాలి. ప్రభుత్వం చొరవ తీసుకొని బిల్లులు మంజూరు చేస్తే నిర్మాణ పనులు ముం దుకు సాగే అవకాశం ఉంది. భవన నిర్మాణానికి సంబంధించిన డ్రాయింగ్ ఫైనల్ చేయాల్సి ఉం ది. బిల్లులు మంజూరుకు స్థానిక నాయకులు ప్ర భుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని న్యాయవాదు లు కోరుతున్నారు. ఇరుకు గదుల్లో కొనసాగుతు న్న ప్రస్తుతం ఉన్న కోర్టు భవనం శిథిలావస్థకు చేరడంతో వర్షాకాలంలో విధులు నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.
తాత్కాలికంగా ఐవోసీ ఏ-బ్లాక్లోకి తరలింపునకు అనుమతి…
శిథిలావస్థకు చేరిన కోర్టు భవనం భారీ వర్షాలకు గతేడాది పెచ్చులూడి పపడంతో అందులోని ఉద్యోగులు భయం భయంతో విధులు నిర్వహిస్తున్నారు. వర్ష్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ప్రస్తుతం తాత్కాలికంగా కోర్టును ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్(ఐవోసీ) భవనంలోని ఏ-బ్లాక్లోకి తరలించేందుకు కలెక్టర్ అనుమతి ఇచ్చారు. నూతన కోర్టు భవనం పూర్తయ్యే వరకు ఏ-బ్లాక్లో కోర్టు కొనసాగేలా అనుమతి ఇచ్చారు. కోర్టును ఐవోసీ ఏ-బ్లాక్లోకి తరలించేందుకు జిల్లా న్యాయమూర్తి పర్యవేక్షణ చేసిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏ-బ్లాక్లోని ఎంపీపీ సమావేశ మందిరం, గదులను కోర్టుకు అనువుగా పునరుద్ధరించాల్సి ఉంటుంది.