నారాయణఖేడ్, అక్టోబర్ 31 : సీఎం కేసీఆర్ నేతృత్వం లోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేండ్లలో తెలంగాణలో ఊహించని రీతిలో అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. పచ్చని తెలంగాణలో కాంగ్రెస్ రక్త చరిత్ర కు తెరలేపిందన్నారు. మంగళవారం నారాయణఖేడ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్షన్ రాజకీయాలతో తెలంగాణ రాష్ర్టాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నదనిఆరోపించారు. సోమవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుండడం, ప్రజల్లో వస్తున్న స్పందనతో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు దక్కించుకుంటుందని సర్వేలు చెబుతుండడంతో ఓటమి ఖాయమని తెలిసి కాంగ్రెస్ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు విద్వేశపూరిత ప్రసంగాలతో ప్రజల మనసులను కలుషితం చేస్తున్న కారణంగానే ఇటువంటి ఘటన జరిగినట్లు భావిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల్లో ఓడిపోతున్నా బుద్ధి మార్చుకోని కాంగ్రెస్ నాయ కులు ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడిని డ్రామాగా చిత్రికరించే ప్రయత్నం చేసి విఫలమైనదన్నారు. దాడి చేసిన వ్యక్తి ఫొటోలను మార్ఫింగ్ చేసి బీఆర్ఎస్, బీజేపీకి చెందినవాడిగా చూపే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ప్రజల ఆదరాభిమానాలతో రెండు సార్లు ఎంపీగా గెలిచి ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు తీవ్రంగా పరిగణించాలని, దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు పరమేశ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సత్యపాల్రెడ్డి, జుజాల్పూర్ సర్పంచ్ జైపాల్రెడ్డి ఉన్నారు.