మెదక్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ ): ఇటీవల మెదక్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గూండాయిజానికి పాల్పడిన సంగతి తెలిసిందే. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తను అనుచరులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి గూండాలను దించి మెదక్, రామాయంపేటలో హల్చల్ చేశారు. అంతేకాకుండా విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేశారు. తీరా ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ శ్రేణులపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను బెదిరించడంతో పాటు దాడులకు పాల్పడిన అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇప్పుడు పోలీసులతో అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒత్తిడితో మెదక్ పట్టణానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసులతో పాటు హత్యాయత్నం చేసులు నమోదు చేసి మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని చిన్నశంకరంపేట పోలీస్స్టేషన్కు తరలించారు. చిన్నశంకరంపేట పోలీస్స్టేషన్ నుంచి బుధవారం మెదక్ కోర్టులో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండ్ విధించడంతో వారిని సంగారెడ్డి జైలుకు పోలీసులు తరలించారు.
ఈనెల 9న మెదక్ మున్సిపాలిటీ 15 వార్డులో ఎన్నికల ప్రచారం చేస్తుండగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. ఆ రోజు తనను కులం పేరుతో దూషించారని బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్త గోదాల అఖిల పోలీసులకు ఫిర్యాదు చేసింది. 15న వార్డులో గొడవ జరిగిన స్థలం వద్దకు రాత్రి తన అనుచరులు, గూండాలతో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వెళ్లారు. ఆ సమయంలో ఇరుపార్టీల శ్రేణుల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ సమయంలో మెదక్ ఎమ్మెల్యే వాహనంపై మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్తో పాటు బీఆర్ఎస్ నాయకులు జీవన్రావు, వేణు, హబీబ్, మల్లేశ్, మరో 23 మంది కలిసి రాళ్లతో దాడిచేసినట్లు కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మెదక్ పాలకవర్గం ఎన్నిక ముగియడంతో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టించి వేధింపులకు గురిచేస్తున్నారు. అధికార కాంగ్రెస్ నేతలు కక్ష పెట్టుకుని అక్రమంగా కేసులు పోలీస్ కేసులు నమోదు చేయిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, పోలీసులతో కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, మెదక్లో పోలీసు రాజ్యం నడుస్తున్నదని, ప్రజ్యాస్వామ్యం లేదని బీఆర్ఎస్ నేతలు మండిపతున్నారు.
మెదక్ పట్టణంలోని 15 వార్డుకు చెందిన ఆటోడ్రైవర్, బీఆర్ఎస్ కార్యకర్త హబీబ్కు చెందిన ఆటోను మంగళవారం రాత్రి దుండగులు దహనం చేశారు. కాంగ్రెస్ నాయకుల నుంచి ప్రాణభయం ఉందని, ఆటో దహనం చేశారని హబీబ్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మెదక్లో కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు, దాడులు పెరిగిపోవడంతో పాటు పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
కులం పేరుతో కాంగ్రెస్ కార్యకర్త గోదాల అఖిలను దూషించడమే కాకుండా మెదక్ ఎమ్మెల్యే వాహనంపై రాళ్లతో దాడిచేసి చంపాలనే ప్రయత్నం చేసినట్లు మాకు ఫిర్యాదులు అందాయి. బీఆర్ఎస్ నాయకుడు మల్లికార్జున్గౌడ్తో పాటు అతని అనుచరులు కులం పేరుతో దూషిస్తూ అసభ్యంగా మాట్లాడినందుకు కాంగ్రెస్ కార్యకర్త గోదాల అఖి ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ మహిళా కార్యకర్తను పరామర్శించేందుకు మెదక్ ఎమ్మెల్యే బయలుదేరిన సమయంలో పిట్లం బేస్ చెరువు కట్ట వద్ద బీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్గౌడ్, జీవన్రావు, కార్యకర్తలు వేణు, హబీబ్, మల్లేశ్తో పాటు 23 మంది ఎమ్మెల్యే వాహనంపై రాళ్లతో దాడి చేసి చంపాలనే ప్రయత్నం చేశారని ఫిర్యాదు అందింది. ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టి కోర్టులో నిందితులను ప్రవేశపెట్టాం. కోర్టు వారిని రిమాండ్కు ఆదేశించింది.
– ప్రసన్నకుమార్, డీఎస్పీ మెదక్