గజ్వేల్, మే 12: 2022-23 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. మండలంలో 14 జడ్పీహెచ్ఎస్లు, సెయింట్ జోసెఫ్ పాఠశాల(ఎయిడెడ్), తెలంగాణ మోడల్ పాఠశాల, బాలుర మైనార్టీ, బాలికల మైనార్టీ, ఎంజేపీ గురుకుల పాఠశాల, కేజీబీవీ, టీఎస్డబ్ల్యూఈఐఎస్ బాలిక పాఠశాలలు ఉన్నాయి. ఇందులో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో తల్లిదండ్రులు, పాఠశాలల ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఫలితాలతో పోల్చితే ఈయేడు కూడా మండలంలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మెరుగైన ఫలితాలే వచ్చాయి. మండలం వ్యాప్తంగా 97శాతం ఫలితాలు నమోదయ్యాయి.
వంద శాతం ఫలితాలు…
గజ్వేల్ మండలంలోని తొమ్మిది పాఠశాలల్లో ఈయేడు వందశాతం ఫలితాలు వచ్చాయి. అందులో బంగ్లావెంకటాపూర్, బూరుగుపల్లి, ప్రజ్ఞాపూర్, సింగాటం, పిడిచేడ్, బెజుగామ, సెయింట్జోసెఫ్(ఎయిడెడ్), ఎంజేపీ గురుకుల బాలుర, టీఎస్డబ్ల్యూఐఎస్ బాలికల పాఠశాలలు ఉన్నాయి. వంద శాతం ఫలితాలు వచ్చిన పాఠశాలల నుంచే 10జీపీఏ సాధించిన వారిలో టీఎస్ఎంఎస్ మూట్రాజ్పల్లి పాఠశాలలో సాత్విక, మైనార్టీ బాలుర పాఠశాలలో సంపత్, మైనార్టీ బాలికల పాఠశాలలో అర్చన, ఎంజేపీ గురుకుల బాలురలో కిరణ్కుమార్, బానుప్రసాద్, సమికంథ, టీఎస్డబ్ల్యూఐఎస్లో కీర్తి 10జీపీఏ మార్కులు వచ్చాయి. ఆయా పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రైవేట్కు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. వంద శాతం ఫలితాలు రావడంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. అందరి ఉపాధ్యాయుల సమష్టి కృషి ఫలితంగా మెరుగైన ఫలితాలు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈయేడు కూడా మంచి ఫలితాలు రావడంతో ప్రభుత్వ విద్యపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో నమ్మకం మరింత పెరుగుతుంది.
రోజూ ప్రత్యేక తరగతులు, పర్యవేక్షణ
గత ఏడాది నవంబర్ నుంచి పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహించి బోధన చేపట్టడంతో మంచి ఫలితాలు సాధించారు. ప్రత్యేక తరగతుల ద్వారా వెనుకబడిన విద్యార్థులను చదువులో ప్రోత్సాహించి వారికి కూడా అందరిలాగే మంచి మార్కులు వచ్చే విధంగా ప్రత్యేకంగా శ్రద్ధచూపడంతో చాలా మంది విద్యార్థులు చివరి మూడు నెలల్లో బాగా చదవడంతో ఎక్కువ మంది పాస్ అయ్యేందుకు ఆస్కారం కలిగిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. రోజూ రెండు విడతలుగా ప్రత్యేక తరగతులు తీసుకొని వారి సందేహాలను నివృత్తి చేసి పాఠ్యాంశాలు చదువుకునే సమయంలో పర్యవేక్షణ చేయడం ఎంతో కలిసొచ్చిందని చెప్పోచ్చు. ఈ యేడు 1069మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా అందులో 1035 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
10జీపీఏ సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకం…
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని 10జీపీఏ సాధించిన విద్యార్థులకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యల శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు రూ.10వేల నగదు ప్రోత్సాహకం త్వరలోనే అందించనున్నారు. ఇందులో గజ్వేల్ మండలం నుంచి ఏడుగురు విద్యార్థులకు అవకాశం లభించింది. ప్రభుత్వం పాఠశాలల్లో చదువుకున్న పేద విద్యార్థులకు మంత్రి హరీశ్రావు ప్రతి యేడు నగదు ప్రోత్సాహకం అందజేస్తానని పరీక్షలకు ముందుగానే ప్రకటిస్తారు. దాంతో జిల్లాలో చాలా మంది విద్యార్థులు పోటీతత్వంలో 10జీపీఏ సాధించే విధంగా చదువుకున్నారు.