సంగారెడ్డి, ఫిబ్రవరి 11: కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు జాతీయ లోక్ అదాలత్లు ఉపయోగపడుతాయని సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్రెడ్డి సూచించారు. శనివారం జాతీయ లోక్ అదాలత్లను జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఉత్తర్వుల మేరకు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో సంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్రెడ్డి అధ్యక్షతనలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హన్మంతరావు నిర్వహించారు. భూ నిర్వాసితులకు పరిహారం చెక్కులు ప్రధాన న్యాయమూర్తి అందజేశారు. జిల్లాలో సంగారెడ్డి-5, జహీరాబాద్-2, జోగిపేట్-1, నారాయణఖేడ్-1 కోర్టుల్లో 9 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శశిధర్రెడ్డి మాట్లాడుతూ సత్వర న్యాయానికి లోక్ అదాలత్లు ఎంతో ఉపయోగపడతాయని, న్యాయవాదుల సలహాలు పాటించి న్యాయం పొందాలన్నారు.
ఈ లోక్ అదాలత్లలో 847 కేసుల పరిష్కారం చేసి బాధితులకు రూ.7,46,29,458 కోట్ల పరిహారం అందించామన్నారు. ముఖ్యంగా సింగూరు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన అన్నదాతలకు రూ.5.60 కోట్ల నష్ట పరిహారాన్ని అందజేశారు. ఇందులో ఎంఏవోపీ-19 కేసులకు సంబంధించిన పరిహారం రూ.1,58,75,000 కోట్లు బాధితులకు ఇప్పించి న్యాయం చేశామన్నారు. బ్యాంకు రికవరీ, టెలిఫోన్, ప్రిలిటిగేషన్, ఎల్ఏవోపీ కేసులు 133 కేసుల్లో రూ.27,54,458 లక్షలు వివిధ బ్యాంకులు, బాధితులకు ఇప్పించామని సూచించారు.
న్యాయవాదులు, కక్షిదారులకు సూచించిన విధంగా కేసులను రాజీ చేసుకుని ఆర్థిక ఇబ్బందులు, సమయం ఆదా చేసుకోవాలన్నారు. లోక్ అదాలత్లలో ఇరు పార్టీలకు సమన్యాయం చేసేందుకు కక్షిదారులు, న్యాయవాదులు, కోర్టు విధులు నిర్వహించే పోలీసులు సమన్వయం చేసుకోవడం సంతోషకరమన్నారు. జాతీయ లోక్ అదాలత్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హన్మంతరావు, సీనియర్ సివిల్ జడ్జి రాధాకృష్ణా చౌహాన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి, అదనపు ప్రథమ శ్రేణి జడ్జి ఎస్.శాలిని, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, న్యాయవాదులు, పోలీసు అధికారులు, కక్షిదారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సమస్య పరిష్కారానికి రాజీయే మార్గం..
మెదక్ అర్బన్, ఫిబ్రవరి 11: రాజీయే రాజమార్గమని, ఏ సమస్యనైనా రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ పి.లక్ష్మీశారద అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ మాట్లాడుతూ శాంతి, సామరస్య వాతావరణంలో, సులువైనా పద్ధతిలో కేసులు పరిష్కరించుకోవాడానికి చక్కటి వేదిక లోక్ అదాలత్ అని అన్నారు. సత్వర న్యాయం అందరికీ చేరువ కావాలన్న ఉద్దేశంతో నిర్వహిస్తున్న లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. అనంతరం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జితేందర్ మాట్లాడుతూ సంధి మార్గం ద్వారా ఏ సమస్యనైనా పరిష్కారమవుతుందన్నారు.
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన లోక్అదాలత్ కారక్రమంలో 2650 కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. బ్యాంకు రికవరీ కేసుల్లో రూ.18,56,198, మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.53,04,670 బాధితులకు నష్టపరిహారం ఇప్పించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ న్యాయమూర్తి రిటాలాల్చంద్, జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కల్పన, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలయ్య, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.