పాపన్నపేట, ఏప్రిల్ 11: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పాపన్నపేట ఎస్సై నరేశ్ వివరాల ప్రకారం.. కుర్తివాడ గ్రామానికి చెందిన ఉబ్ది ఏసయ్య(44) గ్రామంలో ఏడాదిగా ఇతరుల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఆశించిన దిగుబడులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్ట్టుముట్టాయి. దీనికి తోడు ఇటీవల పెద్ద కుమారుడు లక్ష్మణ్కు ఇంట్లో పాముకాటు వేయడంతో చికిత్స నిమిత్తం మరిన్ని అప్పులు చేయాల్సి వచ్చింది. సుమారు రూ.5 లక్షల వరకు అప్పులు కావడంతో తరుచూ బాధపడుతుండేవాడు.
ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఏసయ్య బుధవారం అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా హాల్లో ఉన్న కిటికీకి లుంగీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం తెల్లవారుజామున కుటుంబీకులు నిద్ర లేచి చూసేసరికి విగతజీవిగా కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మెదక్ దవాఖానకు తరలించారు. భార్య కాశమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య కాశమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు.