పాపన్నపేట, ఫిబ్రవరి 8: మెదక్ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత సన్నిధిలో మాఘఅమావాస్య జాతరకు ఆలయ పాలకవర్గం, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. జాతరకు సుమారు లక్ష మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండ గా, ఏడుపాయల్లో పుణ్యస్నానాలు చేయడానికి తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. మంజీరా పాయల మధ్యలో వనదుర్గా భవానీ మాత స్వయంభూగా వెలవడంతో ఇక్కడ స్నానాలు చేస్తే సర్వపాపాలు తొలిగిపోతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తుల సౌకర్యార్థం ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈవో మోహన్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు.
ఏడుపాయల ఆలయం, చెక్డ్యాం, ఘనపూర్ ఆనకట్ట ప్రాంతాల్లో స్నానాలు చేయడానికి షవర్లతో పాటు మహిళలు దుస్తులు మార్చుకోవడానికి సదుపాయాలు కల్పించారు. అమ్మవారి దర్శనానికి వీఐపీ, సాధారణ క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సుమారు 200 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు చేపట్టారు. కాగా, స్నానాలకు అవసరమయ్యే నీటికోసం ఇటీవల సింగూరు ప్రాజెక్ట్ నుంచి ఘనపూర్ ఆనకట్టకు నీటిని సైతం వదిలారు.