Kedarnath | సిద్దిపేట టౌన్, మే 14: చుట్టూ మంచుకొండలు, జల జల పారే సెలయేరు, మందాకిని నదీప్రవాహం, భూలోక దేవలోకంగా చార్ధామ్ యాత్ర విరాజిల్లుతోంది. అందులో ప్రధానమైనదిగా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా వెలుగొందుతున్న పుణ్య క్షేత్రం కేదార్నాథ్ క్షేత్రం. హిమగిరుల్లో కొలువుదీరిన మహిమ గల శైవక్షేత్రాన్ని జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు తపిస్తారు. ఆరు మాసాలు మాత్రమే కేదార్నాథ్ స్వామి దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది. సాహసోపేత క్లిష్టతరమైన యాత్రలో పాల్గొని స్వామి దర్శనం చేసుకోవడం పరమ ఆనందాన్ని కలిగిస్తుంది. అలాంటి చోట యాత్రికుల కోసం సిద్దిపేట కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి గొప్ప సంకల్పానికి నాంది పలికింది. యాత్రికులకు అన్నదానం చేయాలని నిశ్చయించుకుంది. అనుకున్నదే తడువుగా ఐదు సంవత్సరాల క్రితం గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టారు. మూడో సారి అన్నదాన కార్యక్రమం నిర్విజ్ఞంగా చేపట్టారు. ఈ నేపథ్యంలో కేదార్నాథ్ అన్నదాన సేవా సమితిపై ప్రత్యేక కథనం.
అన్నదానం గొప్పది
అన్ని దానాలకెల్ల అన్నదానం గొప్పదని అక్షర సత్యాన్ని సిద్దిపేట కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి నిజం చేసింది. క్లిష్టయాత్రలో భక్తులకు అన్నదానం చేయాలని 2019లో శ్రీకారం చుట్టారు. సేవా సమితి ప్రతినిధులు సుమారు వంద మంది తలా కొంత డబ్బులు వేసుకొని కేదార్నాథ్లో అన్నదానం చేయడానికి పూనుకున్నారు. వాతావరణ పరిస్థితులు క్షణక్షణానికి మారుతుంటాయి. భక్తులకు ఆశించినంత ఆహారం లభించదు. అలాంటి చోట దక్షిణాది రుచులను అందించేందుకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. హిమగిరుల్లో తెలుగు రుచులు యాత్రికులను కట్టి పడేస్తున్నాయి. ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు గౌరవ అధ్యక్షుడిగా కేదార్నాథ్ సేవా సమితికి ఉన్నారు. ఆయన సంపూర్ణ సహకారంతో కేదార్నాథ్లో అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
మందాకిని నదీ సమీపాన లంగర్
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కేదార్నాథ్ ఆలయానికి 21 కిలోమీటర్ల దూరంలో సోను ప్రయాగ్ మందాకినినదీ సమీపాన కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి లంగర్ ఏర్పాటు చేశారు. నిత్యం సేవా సమితి సభ్యులు యాత్రికుల కోసం వివిధ రకాల వంటకాలను సిద్ధం చేసి వడ్డిస్తారు. కేదార్నాథ్ యాత్రకు దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు తరలి వచ్చి దర్శించుకుంటారు. భక్తులకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఏర్పాటు చేసే టీ, టిఫిన్, కాఫీ, బిస్కెట్స్, ఇడ్లి, వడ, ఉప్మ, దోశ, ఊతప్ప, మైసూరు బజ్జి, కిచిడి, పూరి, పొంగల్, అన్నం, స్వీట్లు, పచ్చళ్లు, పలు రకాల కూరగాయలు, సాంబారు, పెరుగు, బేల్పూరి వంటి రకాలను 60 రోజుల పాటు పసందైన భోజనాన్ని యాత్రికులకు వడ్డిస్తున్నారు.
రోజుకు నాలుగు వేల మందికి భోజనం
కేదార్నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం సిద్దిపేట కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి లంగర్లో సుమారు రోజుకు 4వేల మందికి పైగా భోజనాన్ని అందిస్తున్నారు. గత నెల 24 నుంచి ప్రారంభమైన ఈ శిబిరం సుమారు 70 మందితో కూడిన ఈ సేవా సమితి సభ్యులు కేదార్నాథ్ సేవలో పునీతులవుతున్నారు. దేవదేవుడికి ఇష్టమైన అన్నదాన సేవలో సమితి ప్రతినిధులు తమవంతు పాత్ర పోషిస్తూ సేవలో నిమగ్నమవుతున్నారు. నిత్యం అన్నదాన సేవా కేంద్రం వద్ద సుమారు 20 మంది సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వచ్చే యాత్రికులకు అన్నదానం చేస్తున్నారు.
యాత్రికుల సహాయార్థం హెల్ప్లైన్, వసతి
సిద్దిపేట కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి మూడో సారి అన్నదాన కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగానే భోజన వసతితో పాటు రాత్రివేళలో యాత్రికులు నిద్రించేందుకు సుమారు 300 మందికి ఉచితంగా వసతి ఏర్పాటు చేశారు. అనారోగ్యానికి గురైన వారికి వైద్యం కూడా చేయిస్తున్నారు. యాత్రికులకు నీటి సదుపాయం, దుప్పట్లు, పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. కేదార్నాథ్ను దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల సహాయార్థం హెల్ప్లైన్ ఏర్పాటు చేసి స్వామి వారి దర్శనానికి ఎలా వెళ్లాలో చెబుతూ వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.
కేదార్నాథ్లో అన్నదానం దైవ శంకల్పం
కేదార్నాథ్లో అన్నదానం చేయడం దైవ శంకల్పంగా భావిస్తున్నాం. అన్ని దానాలకెళ్లా అన్నదానం మిన్న. మానవ సేవతో మనిషి జీవితానికి పరిపూర్ణ సార్థకత లభిస్తుంది. అందుకే ఈ గొప్ప కార్యాన్ని తలపెట్టాం. కేధారినాథ్ సన్నిధిలో అన్నదానం చేయడం సంతోషాన్ని కలిగిస్తుంది. 2019 నుంచి ఈ గొప్ప కార్యాన్ని నిర్వహిస్తున్నాం. కరోనా సమయంలో రెండేండ్లు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టలేదు. మూడేండ్లుగా కేదార్నాథ్లో నిర్విజ్ఞంగా అన్నదానం చేస్తున్నాం. దక్షిణ భారతదేశంలోనే సోనుప్రయాగ్ వద్ద లంగర్ ఏర్పాటు చేసి తెలుగు రుచులను అందిస్తూ యాత్రికుల మన్ననలు అందుకుంటున్నాం. గతంతో పోలిస్తే యాత్రికుల సంఖ్య పెరుగుతుంది. అందుకు అనుగుణంగా భోజనాన్ని అందిస్తున్నాం. భక్తుల సహాయార్థం ప్రత్యేకంగా హెల్ప్లైన్ ఏర్పాటు చేశాం. వసతిని కూడా కల్పిస్తున్నాం.
– చీకోటి మధుసూదన్, సిద్దిపేట కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షుడు