ఇప్పుడు గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. పచ్చకోక చుట్టుకొని మాగాణం మురిసిపోతున్నది. ఊరిజనం జాతరలో పల్లె పదం వినిపిస్తున్నది. బొడ్రాయి పండుగ.. బోనాల పండుగ.. బీరప్ప ఉత్సవం.. పెద్దమ్మ పెద్దిరాజు వార్షికోత్సవం.. మహంకాళి మాత, దుర్గమ్మ, రేణుకా ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మకు బోనం.. కందూరు.. ఇలా గ్రామ దేవతల ఉత్సవాలతో పల్లెల్లో సందడి నెలకొన్నది. ఏ పల్లెలో చూసినా ఏదో ఒక ఉత్సవం సాగుతున్నది. పల్లెలను పచ్చగా చూసే తల్లులు.. గ్రామ సరిహద్దుల్లో ఉంటూ తమ బిడ్డలను కాచే కల్పవల్లులు.. పల్లె పొలిమేరల్లో కొలువై ఉన్న శక్తి స్వరూపిణులను గ్రామీణులు కొలిచి తరిస్తున్నారు.
సిద్దిపేట, మే 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బొడ్రాయి పండుగ.. బోనాల పండుగ.. బీరప్ప ఉత్సవం.. పెద్దమ్మ పెద్ది రాజు వార్షికోత్సవం.. మహంకాళి మాత, దుర్గమ్మ, రేణుకా ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మకు బోనం.. కందూరు.. ఇలా గ్రామ దేవతల ఉత్సవాలతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఏ పల్లె చూసినా ఏదో ఒక ఉత్సాహంగా సాగుతున్నది. లక్షల రూపాయలు వెచ్చించి కొత్తగా దేవాలయాలు నిర్మించడంతో పాటు ఇంటి ఆడపడుచులు, బంధుమిత్రులను పిలిచి జోరుగా పండుగలు నిర్వహిస్తుండడం కనిపిస్తున్నది. ఒకనాడు కరువు కాటకాలతో అల్లాడిన పల్లెలు ఇవాళ సస్యశ్యామలంగా మారాయి. ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుగుతున్నాయి. బతుకు జీవనం కోసం వలస పోయిన వారంతా తిరిగి రావడంలో పల్లెలు కళకళలాడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పల్లెల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మౌలిక వసతులు మెరుగపడ్డాయి.
సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.ఉన్న చోటనే చేతినిండా పని దొరుకుతున్నది. నాడు పట్టణాల్లో ఉండాలని కోరుకున్న వారంతా ఇవాళ పల్లెలోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. గతంలో ఎప్పుడూ పల్లెల్లో ఇలాంటి వాతావరణం కనిపించలేదు. పుష్కలంగా సాగునీరు.. భూమికి బరువయ్యేలా పంటలు.. ఉన్న ఊరిలోనే చేతినిండా పని దొరుకుతుండడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని పల్లెల జీవన విధానం మారింది. గడిచిన ఎనిమిదేండ్లలో పల్లెలు బాగా అభివృద్ధి చెందాయి. సీఎం కేసీఆర్ పల్లెల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపడంతో ఇవాళ దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మన్ననలు పొందుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో ఉన్న ఊరిలో పని దొరకక ఇతర రాష్ర్టాలు, దేశాలు తదితర ప్రాంతాలకు వలస వెళ్లి బతుకులు వెళ్లదీశారు. నాడు రెక్కాడితే గానీ, డొక్కాడని పరిస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆ పరిస్థితులు లేవు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు పచ్చని చెట్లతో, పచ్చని వాతావరణంతో స్వాగతం పలుకుతున్నాయి. ఒక మంచి వాతావారణం నెలకొంది. లక్షల రూపాయలు వెచ్చించి హైలెవల్గా గృహాలు నిర్మించుకుంటున్నారు. పట్టణాల్లో ఎలాంటి సౌకర్యాలతో ఉంటున్నాయో, అంతకన్నా రెట్టింపు స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నాయి.
గ్రామ దేవతల పండుగలు…
ఒకనాడు నిత్యం కరువు కాటకాలు.. రైతు ఆత్మహత్యలు.. ఆకలి చావులు.. తీవ్ర దుర్భిక్ష, దుర్భర పరిస్థితులు ఉండేవి. బతుకు బండిని లాగించడానికి పల్లెప్రజలు అష్టకష్టాలు పడాల్సిన స్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో అవన్నీ పోయాయి. పల్లెలు ఇప్పుడు నూతన ఒరవడిని సృష్టిస్తున్నాయి. గుణాత్మక మార్పు పల్లెల్లో కనిపిస్తున్నది. గ్రామం అన్ని విధాలుగా మంచిగా ఉండాలి.. సిరి సంపదలతో తులతూగాలి.. అన్ని మంచి జరగాలి.. అని గ్రామ బొడ్రాయి పండుగలను ఊరు ఊరంతా కలిసి నిర్వహిస్తున్నారు. వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు చేస్తున్నారు. చివరి రోజు పెద్ద ఎత్తున దావతులతో గ్రామాలు ఫుల్జోష్లో ఉంటున్నాయి. ఇక ఆయా గ్రామాల్లో వారి కుల దేవతల పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బీరప్ప, రేణుకా ఎల్లమ్మ, పెద్దమ్మ, పెద్దిరాజు, మహంకాళి పండుగలు జరుపుకొంటున్నారు. గతంలో ఇంటి వరకు ఉన్న దుర్గమ్మ పండుగను ఊరు ఊరంతా ఒకే దగ్గర గుడికట్టి నిర్వహిస్తున్నారు. ఇక యాసంగి ధాన్యం చేతికి రాగానే వ్యవసాయ పొలాల వద్ద మైసమ్మ పండుగకు చేస్తున్నారు. పండించిన ధాన్యాన్ని అమ్మవారి ముందు పెట్టి, పండుగలు జరుపుతున్నారు. మరికొందరు పోలి చేసుకుంటారు.
వరినాటు వేయగానే పొలంలో నాగలిని పాతి పెడతారు. వరి కోతకు వచ్చే వరకు దానిని అలానే ఉంచుతారు. ఇలా కోత సమయంలో పోలి చేసి నాగలిని తీసి పండుగ చేసుకుంటారు. సర్వమతాలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో పండుగలు నిర్వహించుకోవడం ఇక్కడ జరుగుతున్నది. మరికొంత మంది రైతులు తమ వ్యవసాయ పొలాల వద్ద కందూరు చేసుకుంటారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు పండుగలను నిర్వహించుకుంటున్నారు. ఇవి కాకుండా కొత్తగా దేవాలయాల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. అంతిమంగా ప్రతి ఒక్కరిలో భక్తిభావం పెరిగింది. దీంతో పల్లెల్లో పండుగలు జోరుగా కొనసాగుతున్నాయి.
పుష్కలంగా సాగునీరు.. పంటలే పంటలు..
సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నంతో ఎక్కడో ఉన్న గోదావరి నీళ్లు ఇక్కడి బీడు భుములకు మళ్లించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున రిజర్వాయర్ల నిర్మించడంతో పుష్కలంగా సాగునీరు అందుతున్నది. నాడు సాగునీరు లేక భూములన్నీ పడావు ఉండగా, ప్రస్తుతం ఆ భూములన్నీ పచ్చని పంట పొలాలుగా మన ముందు కనిపిస్తున్నాయి. ప్రతీ గుంట సాగులోకి వచ్చింది. భూముల ధరలు పెరిగాయి. రైతుకు గుర్తింపు లభిస్తున్నది. మంచి పంటలతో రైతులు సంతోషంగా ఉన్నారు. రైతులకు కావాల్సిన అన్ని పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తున్నది. దీంతో రైతులు సంతోషంగా వ్యవసాయాన్ని పండుగలా చేస్తున్నారు. ఎక్కడెక్కడో వలసలు పోయిన వారంతా తిరిగి తమ గ్రామాలకు తిరిగి వచ్చారు. పల్లెల్లో ఎటు చూసినా పచ్చని వాతావరణం కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల వారికి చేతినిండా పని కల్పించింది. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యింది. వారంతా సంతోషంగా ఉండి కొంత కాలంగా గ్రామ దేవతలకు పండుగలు చేస్తున్నారు.