సిద్దిపేట, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నది. పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ తన సందేశాన్ని ఇచ్చారు. జిల్లాలో జరిగే ఆత్మీయ సమ్మేళనాల్లో ముందుగా సీఎం కేసీఆర్ సందేశాన్ని పార్టీ క్యాడర్కు చదివి వినిపిస్తారు. ఆ సందేశంలో పార్టీ శ్రేణులు రాష్ట్రం కోసం ఎలా కష్టపడి సాధించారో చెప్పారు. కష్టసుఖాల్లో కలిసినడుస్తూ.. ఒక్కొక్కరు ఒక్కో కేసీఆరై పల్లెలు, గల్లీల్లో గులాబీ పతాకాన్ని రెపరెపలాడించి నాకు.. కొండంత అండగా నిలిచిన మీ రుణాన్ని ఎన్నడూ తీర్చుకోలేను. రాష్ట్రం సాధించాక ఎలా అభివృద్ధి చేసుకున్నాం.. ఇవాళ తెలంగాణ యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందో సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులకు నమస్తే..! అన్నం తినో అటుకులు తినో.. ఉపాసం ఉండో 14 ఏండ్లు పేగులు తెగేదాక కొట్లాడి రాష్ర్టాన్ని సాధించుకున్నాం.. అధికారం లేకున్నా ఉద్యమ కాలంలో జెండా భుజాన వేసుకొని.. లాఠీ దెబ్బలకు జైళ్లకు వెరవ కుండా రేయింబవళ్లు శ్రమించి పార్టీని కాపాడుకున్న ఘనత కీర్తి గులాబీ సైనికులకే దక్కుతుంది. ప్రజల ఆశీర్వాదం.. నిబద్ధత కలిగిన లక్షలాది కార్యకర్తల అసమాన కృషితో అపురూప విజయాలు సాధించి రెండు సార్లు తెలంగాణలో బీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టింది. ఉద్యమ వీరులుగా ఆనాడు.. నవ నిర్మాణయోధులుగా ఈనాడుపట్టుదల.. అంకిత భావంతో పనిచేస్తూ అపూర్వ విజయాలు సాధించిపెట్టింది మీరే.. మీరిచ్చిన బలంతోనే 60 లక్షల సభ్యత్వంతో అజేయమైన శక్తిగా ఎదిగింది బీఆర్ఎస్.. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఎవ్వరికీ సాధ్యంకానీ.. ఏకపక్ష విజయాలు సాధిస్తూ రికార్డులు తిరగరాసింది.. 21 ఏండ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను.. ఆటుపోట్లను తట్టుకొని మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూ గమ్యాలను ముద్దాడిన గట్టిసిపాయి మన పార్టీ.
కష్టసుఖాల్లో కలిసినడుస్తూ.. ఒక్కొక్కరు ఒక్కో కేసీఆరై పల్లెలు, గల్లీల్లో గులాబీ పతాకాన్ని రెపరెపలాడించి నాకు కొండంత అండగా నిలిచిన మీ రుణాన్ని ఎన్నడూ తీర్చుకోలేను. ఇతరులకు పాలిటిక్స్ అంటే గేమ్.. బీఆర్ఎస్కు మాత్రం టాస్క్. రాజకీయాన్ని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పవిత్ర కర్తవ్యంగా భావించి.. కొత్త పంథాలో నడుస్తూ కోటి ఆశలతో ఏర్పడ్డ తెలంగాణను కోటి కాంతులు విరజిమ్మే నేలగా తీర్చిదిద్దుకున్నాం.కష్టాలు.. కన్నీళ్లు.. కరువులతో అల్లాడిన తెలంగాణ.. ఇవాళ పచ్చని పంటలతో చిరునవ్వులతో కళకళలాడుతున్నది. ఆగమైపోయిన తెలంగాణ నేడు కుదుటపడ్డది..కడుపునిండా తిని.. కంటినిండా నిద్రపోతున్నది. ఒక్కో పథకం ఒక్కో ఆణిముత్యమై దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.. కలలో కూడా ఊహించని కార్యాలను చేపట్టి.. అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేసి చూపించి.. తెలంగాణను దేశానికినమూనాగా నిలబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అడిగినవీ.. అడగనవీ..చెప్పినవీ.. చెప్పనవీ ఎన్నో పనులు చేస్తూ.. అందరి బంధువుగా నిలిచాం.. ఏ వర్గాన్నీ చిన్నబుచ్చలేదు.. ఏ ఒక్కరినీ విస్మరించలేదు..మనకు కులం లేదు.. మతం లేదు.. తెలంగాణ సమాజానికి పొత్తుల సద్దిమూట బీఆర్ఎస్..సంపదను పెంచుతూ.. ప్రజలకు పంచుతూ భారతదేశాన్ని సాకే ఐదారు
రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించి ఉజ్వలంగా వెలుగొందుతున్నది తెలంగాణ.
మనం ఇట్లా ఉంటే .. దేశం కథ ఇంకోలెక్కన ఉంది. 75 ఏండ్ల స్వతంత్రం తర్వాత కూడా కోట్లాది మందికి తాగడానికి నీళ్లు లేవు.. తినడానికి తిండి లేదు. నదుల నిండా నీళ్లున్నా.. పొలాలకు సాగునీళ్లు రాలేదు. కరెంట్ కష్టాలు తీరలేదు. అన్ని వనరులూ వసతులూ ఉండి కూడా భారతదేశం భంగపడుతున్నది. చైనా..సింగపూర్.. దక్షిణ కొరియాలాంటి దేశాలు అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంటే.. మనం ఇంకా కులాల మతాల కుమ్ములాటల్లో మునిగిపోయి ముందడుగు వేయలేకపోతున్నం.
మన ఒక్క రాష్ట్రం బాగుంటే సరిపోదు.. దేశం కూడా బాగుండాలి. దేశాన్ని ఇన్నాళ్లు పాలించిన కాంగ్రెస్.. బీజేపీలకు తెలివి లేదు.. విజన్ లేదు.. సంకల్పం లేదు. అందుకే దేశానికి కొత్త ఎజెండాను నిర్దేశించి.. జాతీయ రాజకీయాలను ప్రభావితం
చేసేందుకు భారత రాష్ట్ర సమితిగా మరో ప్రస్థానాన్ని మొదలుపెట్టినం. ఏదైనా పనిమొదలుపెడితే.. కడదాకా కాడిదించే అలవాటేలేని ఉక్కు సంకల్పం మనది.ఆబ్కీ బార్ కిసాన్ సర్కారు నినాదం ఎత్తుకొని దేశం కోసం బయలెల్లిన మన పార్టీపైన
కేంద్రంలోని బీజేపీ బరితెగింపు దాడులు చేస్తూ.. తెలంగాణ ప్రగతిని అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నది. వేల దాడులు.. లక్షల కుట్రలను ఛేదించి నిలిచి గెలిచిన పార్టీ మనది.. నాడు మనం భయపడితే తెలంగాణ వచ్చేదా..?
సాహసమే ఊపిరిగా సాగుతున్న ప్రయాణంలో.. మీరే నా బలం.. మీరే నా బలగం.తెలంగాణ చైతన్యం తొణికిసలాడే గడ్డ. ప్రజలే కేంద్ర బిందువుగా వారి సమస్యలే ఇతివృత్తంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ సమాజం ఎన్నడూ
వదులుకోదు. చిల్లర మల్లర రాజకీయ శక్తులను ఎప్పుడూ ఆదరించదు.తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీది పేగుబంధం. పురిటిగడ్డపైన మరోసారి గులాబీ పార్టీ మరోసారి బ్రహ్మాండమైన విజయం సాధించడం తథ్యం. ఇది ఎన్నికల సంవత్సరం.. నిరంతరం ప్రజల్లో ఉంటూ పనికి మాలిన పార్టీలు పనికట్టుకొని చేసే దుష్ప్రచారాలను.. అప్రమత్తతతో తిప్పికొట్టాలి. భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేసే బాధ్యత మీ భుజ స్కంధాలపైనే ఉంది. ధర్మమే జయిస్తుంది.
జై తెలంగాణ.. జై భారత్
కే. చంద్రశేఖర్రావు బీఆర్ఎస్ అధ్యక్షుడు