అభివృద్ధికి మారుపేరు టీఆర్ఎస్ ప్రభుత్వం
సంగారెడ్డి జిల్లాలో రోడ్లకు రూ.147 కోట్లు ఇచ్చాం
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
సంగారెడ్డి, ఏప్రిల్ 17: రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారని, ప్రజలు వాటిని తిప్పికొట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని పోతిరెడ్డిపల్లి కొత్లాపూర్ రోడ్డులో కొత్లాపూర్ మీదుగా మక్లా అల్లూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధికి మారుపేరుగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచిందని, జిల్లాలోని రోడ్లకు రూ.147 కోట్ల నిధులు మంజూరు చేశామని తెలిపారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించేందుకు నిధులు కేటాయిస్తున్నామన్నారు. జిల్లాలో పీఎంజీఎస్వైలో రోడ్ల అభివృద్ధికి రూ.80 కోట్లు, మరమ్మతులకు రూ.22 కోట్లు, కొత్త రోడ్లకు రూ.3.48 కోట్లు, నరేగా కింద రూ.37 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
జిల్లాలో అత్యవసరమున్న రోడ్లకు నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు సంబంధించిన ప్రణాళికలు స్థానిక జిల్లాలో డైనమిక్ లీడర్ మంత్రి హరీశ్రావు ఉన్నారని, ఆయన ఆర్థిక మంత్రి కావడంతో నిధులకు కొరత లేదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తన దగ్గరకు వచ్చి ఎదో ఒక పనికి నిధులు అడుగుతారన్నారు. కలెక్టర్ హనుమంతరావు కూడా అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, లేబర్ వెల్ఫేర్ రాష్ట్ర చైర్మన్ దేవేందర్రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ రాజర్షి షా, జడ్పీ సీఈవో ఎల్లయ్య, పంచాయతీ అధికారి సురేశ్ మోహన్, డీఆర్డీవో శ్రీనివాస్రావు, ఆర్డీవో మెంచు నగేశ్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లత, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, ఎంపీపీ లావణ్య, సర్పంచ్ సందీప్రెడ్డి, మాజీ సర్పంచ్ సుదర్శన్రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్, వెంకటేశం, నాయకులు పాల్గొన్నారు.