జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించని ప్రతికా స్వేచ్ఛ తెలంగాణలో ఉందని ఎమ్మెల్సీ, కవి, గాయకుడు గోరెటి వెంకన్న అన్నారు. పటాన్చెరులో నిర్వహిస్తున్న ఐజేయూ 10వ ప్లీనరీ రెండో రోజు సమావేశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రెస్ అకాడమీని బలోపేతం చేసి జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు. అర్హులకు హెల్త్, అక్రిడిటేషన్ కార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఐజేయూ అధ్యక్షుడు వినోద్ కోహ్లి, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణలు గోరెటి వెంకన్నను ఘనంగా సన్మానించారు.
పటాన్చెరు, జనవరి 9: దేశానికి తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్సీ, కవి, గాయకుడు గోరెటి వెంకన్న అన్నారు. సోమవారం పటాన్చెరులో ఐజేయూ 10వ ప్లీనరీ సమావేశాలకు ప్రత్యేక అతిథిగా వచ్చిన గోరేటి వెంకన్న మాట్లాడుతూ జాతీయ జర్నలిస్టు సంఘం హైదరాబాద్లో జర్నలిస్టు ల ప్లీనరీ పెట్టడం గర్వకారణమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కనబడని పత్రిక స్వేచ్ఛ తెలంగాణలో కనిపిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. జర్నలిస్టులకు హెల్త్కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు అందిస్తున్నారన్నారు.
జర్నలిస్టులకు అన్ని రకాలుగా అండగా సీఎం నిలుస్తున్నారని కొనియాడారు. కవి, కళాకారులకూ తెలంగాణలో ఆదరణ లభిస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదన్నారు. తెలంగాణ పోరాటంతో జర్నలిస్టుల పాత్ర గొప్పదన్నారు. తెలంగాణ సంస్కృతి, ఔన్నత్యంపై గోరెటి వెంకన్న పాడిన పాటలు ఆహూతులను అలరించాయి. ఐజేయూ అధ్యక్షుడు వి నోద్ కోహ్లి, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, గోరెటి వెంకన్నను ఘనంగా సన్మానించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
జర్నలిస్టుల సంక్షేమానికి అనేక పథకాలు
తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చిందని టీయూడబ్ల్యూజే- టీజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ అన్నారు. సోమవారం పటాన్చెరులో నిర్వహించిన రెండు రోజుల ఐజేయూ జాతీయ ప్లీనరీలో మారుతీసాగర్ పాల్గొన్నారు. జాతీయ జర్నలిస్టుల ప్రతినిధి, ఐజేయూ అధ్యక్షుడు వినోద్ కోహ్లీ అధ్యక్షతన ఐజేయూ ప్లీనరీ నిర్వహించారు. తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం, మీడియా అకాడమీ చేస్తున్న సాయాన్ని మారుతీ సాగర్ వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ పోరాటంలో టీజేఎఫ్ ముందుండి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించినట్లు తెలిపారు. రాష్ట్రం సాధించిన తరువాత టీయూడబ్ల్యూజే టీజేఎఫ్గా సమావేశం 10 వేల మందితో హైదరాబాద్లో నిర్వహించారన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.10 కోట్ల సంక్షేమ నిధిని ఇవ్వాలని సీఎం కేసీఆర్ను కోరితే అంత తక్కువ నిధితో ఏ సంక్షేమం సాధ్యంకాదని, రూ.100కోట్లతో ఏర్పాటు చేశారన్నారు. అప్పటివరకు ఏపీలో రూ.కోటి మాత్రమే ఉండేదని, వందరెట్లు నిధి సమకూర్చిన ఘనత సీఎం కేసీఆర్దని అన్నారు. 2017 నుంచి ఈ నిధికి వడ్డీనే రూ.16 కోట్లు జమ అయ్యిందన్నారు.
వంద కోట్లతో కార్యక్రమాలు
రూ.వంద కోట్ల నిధులతో మీడియా అకాడమీ పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదన్నారు. తెలంగాణలో 20 వేల మంది అక్రిడిటేషన్ జర్నలిస్టులు ఉన్నారన్నారు. తెలంగాణ సర్కారు ప్రతి జర్నలిస్టుకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించిందన్నారు. జర్నలిస్టు మరణిస్తే రూ.లక్ష సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పలు చోట్ల దళితబంధులో రూ.10 లక్షలు ప్రభుత్వం అందించిందన్నారు. హెల్త్ కార్డు ఉన్న జర్నలిస్టులకు ఎంత ఖర్చైనా చికిత్స అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ప్రభుత్వం సంక్షేమ నిధికి రూ.58 కోట్లు కూడా విడుదల చేసిందన్నారు.
ఇప్పటికే కొన్నిచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు జర్నలిస్టులకు ఇండ్లు, ప్లాట్లు కేటాయించారన్నారు. రెండో రోజు కార్యక్రమాలను మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పరిశీలించారు. కార్యక్రమంలో ఐజేయూ ప్రధాన కార్యదర్శి సభా నాయకన్, సురేశ్ అఖారీ, సబీన ఇంద్రజిత్, స్మీజన్, నారాయణ్ ప్రధాన్, బాబురెడ్డి, మురళి, టెమ్జు అధ్యక్షుడు ఇస్మాయిల్, రమణకుమార్, కొండల్రావు తదితరులు పాల్గొన్నారు.