మర్కూక్, ఆగస్టు 30 : కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నదని మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం మర్కూక్ మండలంలో సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో రూ. 2.40 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఎంతో కృషి చేశారన్నారు. ‘మన ఊరు- మన బడి’తో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టారని, దీంతో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్కు దీటుగా అభివృద్ధి చెందాయన్నారు.
సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవలి ఆదర్శంగా మారిందన్నారు. అన్ని వర్గాల పిల్లలకు సమాన చదువు అందించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం గురుకులాలకు పెద్దపీట వేస్తున్నదన్నారు. ఎర్రవల్లి డబుల్ బెడ్రూం ఇండ్లు రాష్ర్టానికే దిక్సూచిగా మారాయన్నారు. దేశంలోనే గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నంబర్వన్ స్థాయిలో నిలిపారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపీపీ పాండుగౌడ్, జడ్పీటీసీ మంగమ్మారామచంద్రం, వైస్ ఎంపీపీ బాల్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణకర్రెడ్డి, ఎంపీటీసీ ధనలక్ష్మీకృష్ణ, సర్పంచ్ భాగ్యభిక్షపతి, ఎంఈవో ఉదయ్భాస్కర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బాల్రాజు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.