దళితవాడల్లో దశాబ్దాల చీకట్లు తొలిగి వెలుగులు విరజిమ్ముతున్నాయి. ‘దళితబంధు’ పథకం వారి తలరాతను మారుస్తున్నది. ఏడాది క్రితం పురుడు పోసుకున్న ఈ పథకం కూలీనాలి చేసుకునే వారి జీవితాల్లో వెలుగులు నింపింది. మొన్నటిదాకా కూలీలు, డ్రైవర్లుగా పనిచేసిన వారు నేడు ఓనర్లు, వ్యాపారులుగా మారారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టగా.. ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలి విడతగా 1,194 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు వర్తింపజేసింది. ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులు యూనిట్లు ఏర్పాటు చేసుకుని సొంతంగా వ్యాపారాలు నిర్వహిస్తూ కుటుంబాలను పోషించుకుంటూ ఆర్థికాభివృద్ధి చెందుతున్నారు. తమ కాళ్లపై తాము నిలబడడమే కాకుండా మరికొంత మందికి ఉపాధి చూపుతున్నారు. తమకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
సిద్దిపేట, జనవరి 21 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దళితబంధు పథకం’తో దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. మొన్నటి వరకు కూలీ పనిచేసి జీవనోపాధి పొందినవారికి దళితబంధు పథకంలో భాగంగా ఆర్థిక సాయం అందజేసింది. రూ.10లక్షలు విలువ చేసే యూనిట్లు సొంతం కావడంతోపాటు దండిగా ఉపాధి పొం దుతున్నారు. గతంలో కారు డ్రైవర్లుగా పనిచేసినవారు నేడు దళితబంధు పథకంతో ఓనర్లు, గతంలో రోజువారీ కూలీలు.. నేడు యజమానులయ్యారు.
ఒక్కో లబ్ధిదారుడికి రూ.10లక్షల చొప్పున పథకానికి ఖర్చు చేసింది. దళితుల రక్షణ కోసం దళితనిధి పథకాన్ని సైతం తీసుకువచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,194 కుటుంబాలను ఎంపిక చేసి, దళితబంధు యూనిట్లు అందజేశారు. ప్రతి నియోజకవర్గానికి 1500 చొప్పున దళిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున, తొలుత ప్రతి నియోజకవర్గానికి 500 చొప్పున ఇవ్వనున్నారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 11 నియోజకవర్గాలు, జనగామ, మానకొండూరు కలుపుకొని మొత్తంగా 5,600 కుటుంబాలకు రెండో విడత దళితబంధు సాయం అందిస్తారు.
తొలి విడతలో 1,194 కుటుంబాలకు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,194 కుటుంబాలను ఎంపిక చేసి, దళితబంధు యూనిట్లు అందజేశారు. ప్రతి నియోజకవర్గంలో తొలి విడతలో 100మంది లబ్ధిదారులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి రూ.10లక్షల ఆర్థిక సాయం అందించింది. 60కు పైగా వివిధ రకాల యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లాలో 495 కుటుంబాలకు రూ. 45.50 కోట్లు, మెదక్ జిలాలో 255 కుటుంబాలకు రూ.25.50 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 444 కుటుంబాలకు 44.40కోట్లు అందజేశారు. లబ్ధిదారులు వారు ఎంచుకున్న వ్యాపారాల్లో నష్టపోతే ఆర్థికంగా అండగా ఉండేందుకు రక్షణ నిధిని ఏర్పాటు చేసింది. లబ్ధిదారుల నుంచి రూ.10వేలు సేకరించి, మరో రూ.10వేలు ప్రభు త్వం జమ చేసి, దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేసి ఆ కుటుంబాలకు భరోసానిచ్చింది. రక్షణ నిధి నిర్వహణ కలెక్టర్ పర్యవేక్షణలో లబ్ధిదారుల కుటుంబాలు నిర్వహిస్తున్నాయి. స్వయం సహకార బృందాల మాదిరిగా వారు పరస్పరం సహకరించుకునే విధంగా ప్రభుత్వం ఈ రక్షణ వ్యవస్థను రూపొందించింది.
ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షలు
ఒక్కో లబ్ధిదారుడికి రూ.10లక్షల చొప్పున పథకానికి ఖర్చు చేసింది. లబ్ధిదారులు ఇష్టమైన పథకాన్ని ఎంచుకున్నారు. పాడిపరిశ్రమ, నాలుగు చక్రాల వాహనాలు, ల్యాబ్ టెక్నీషియన్, కారు ట్యాక్సీ, క్లాత్ ఎంపోరియం, వరికోత మిషన్, టెంట్ హౌస్ దుకాణాలు ఇలా లబ్ధిదారుల ఇష్ట ప్రకారం ఎంచుకున్న పథకాలకు ప్రభుత్వం నిధులు ఇచ్చింది. లబ్ధిదారులు నిర్వహిస్తున్న ఉపాధి ప్రగతిని ఎప్పటికప్పడు అధికారులు సమీక్షిస్తున్నారు. పథకం అం దించినప్పటి ఇప్పటి వరకు వారి వ్యాపారాలు ఎలా కొనసాగుతున్నాయి.. వ్యాపారంలో మెళకువలు తదితర వాటిపై అధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకా రం ప్రతి నియోజకవర్గానికి 1,500 మందికి దళితబంధు వర్తించనున్నది. ఈ లెక్కన ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, అందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్, పటాన్ చెరువు నియోజకవర్గాలతో పాటుగా సిద్దిపేట జిల్లాలో జనగామ నియెజకవర్గంలోని నాలుగు మండలాలు, మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలం ఉన్నాయి. 11 నియోజకవర్గాలకు లెక్క వేసుకున్న మొత్తం 16,500 మంది లబ్ధిదారులు అవుతారు. మిగతా మండలాలకు కలిపి వంద లెక్క వేసుకున్న మొత్తంగా సరాసరి 16,600 మంది కుటుంబాలకు దళితబంధు దశల వారీగా అందనున్నది. తొలి విడతగా ప్రతి నియోజకవర్గానికి 500 మందికి అందజేస్తున్నారు. 11 నియోజకవర్గాలతో పాటు జనగామ నియోజకవర్గానికి కలుపుకొని మొత్తంగా 5,600 మంది కుటుంబాలకు దళిత బంధుపథకం తొలి విడతలో అందనున్నది. ఆ దిశగా అధికార యంత్రాంగం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
దేశంలోనే అత్యుత్తమ పథకం..
దళితబంధు పథకంలో మీసేవ కేంద్రంతో పాటు కామన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నా. ఎంఏ, బీఈడీ పూర్తి చేయడంతోపాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేశా. ఉద్యమం, చదువుల వల్ల ఎలాంటి ఉపాధి లేదు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో లబ్ధిదారుడిగా ఎంపిక చేశారు. రూ.10లక్షలు మంజూరు చేయడంతో మీసేవ కేంద్రాన్ని ప్రారంభించి, వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఆధార్ కేంద్రాన్ని మీసేవ కేంద్రానికి సర్కారు అనుసంధానం చేస్తే ప్రజలకు ఎన్నో సేవలు అందించవచ్చు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి రుణపడి ఉంటాం. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టి దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
-రామగల్ల బాబు(దళితబంధు లబ్ధిదారుడు, చేర్యాల)
బతుకుపై నమ్మకం కలిగింది
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకంతో బతుకుపై నమ్మకం కలిగింది. గతంలో ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడిని. దళితబంధు పథకం కింద మంజూరైన రూ.10లక్షలతో సంగారెడ్డి బైపాస్లో మీసేవ కేంద్రం, జిరాక్స్ సెంటర్ను ప్రారంభించి, సొంతంగా లబ్ధిపొందడంతో పాటు మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నాను. మీసేవ కేంద్రం పక్కనే మరో షెటర్ అద్దెకు తీసుకొని నా భార్య సుశీలకు ఎంబ్రాయిడరీ, స్టిచింగ్ సెంటర్ను పెట్టా. దళిత బంధు స్కీం ద్వారా మా ఇద్దరికి జీవనోపాధి దొరికింది. వ్యాపారం బాగానే ఉంది. మా జీవనానికి ఒక సేఫ్టీ కల్పించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా.
పి.దేవయ్య, లబ్ధిదారుడు, ఉత్తర్పల్లి, కంది మండలం, సంగారెడ్డి జిల్లా
మరో ముగ్గురికి ఉపాధి కల్పిస్తున్నా..
‘దళితబంధు’ పథకంతో నేను వెల్డింగ్ షాప్ గ్రామంలో ఏర్పాటు చేసుకున్నా. అంతకు ముందు చిన్న మిషనరీతో వివిధ ప్రాంతాలకు వెళ్లి పనులు చేసేవాడిని. ఇప్పుడు సొంతంగా వెల్డింగ్ మిషన్ షాప్ పెట్టుకొని పెద్ద మిషనరీతో పనిచేస్తున్నా. ట్రాక్టర్కు సంబంధించిన ట్రాలీలు, కల్టివేటర్లు, కేజ్వీల్స్, షట్టర్స్, గ్రిల్స్ తదితర పెద్ద పెద్ద పనులు పట్టుకొని ఉపాధి పొందుతున్నాను. ప్రస్తుతం రోజు కొత్తగా ఆర్డర్లు వస్తున్నాయి. నెలకు రూ.40నుంచి 50వేల వరకు సంపాదిస్తున్నా. నేను ఉపాధి పొందడమే కాక మరో ముగ్గురికి ఉపాధి కల్పిస్తున్నా. చాలా గర్వంగా ఉంది. దళితులపై ఇంతకు ముందు ఏ నాయకుడు ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మా బాధలను చూసి మాకు అండగా నిలిచాడు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే మదన్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.
-కంజర్ల రాము, తిర్మలాపూర్(మెదక్ జిల్లా)
సీఎం కేసీఆర్ మాపాలిట దేవుడు..
దళితబంధు ద్వారా తనను ఆదుకున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను గతేడాది క్రితం వరకు మా ఊరిలో ఎలక్ట్రీషియన్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడిని. సీఎం కేసీఆర్ దయవల్ల రూ.10లక్షలతో ఎలక్ట్రికల్షాపు పెట్టుకొని ఆర్థికంగా ఎదుగుతున్న. భగవంతుడే సీఎం కేసీఆర్ రూపంలో మాకు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నాడు. పేద దళితులను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
-సుందరగిరి యాదయ్య, లబ్ధిదారు, ధూళిమిట్ట (సిద్దిపేట జిల్లా)
రంది తీర్చిన ‘దళితబంధు’
ఆర్థిక ఇబ్బందులతో నిత్యం బాధపడే దళితుల రంది తీర్చిన అద్భుత పథకం దళితబంధు. మా గ్రామంలోని 95 దళిత కుటుంబాల్లో అనేక మంది యువకులు కూడా ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి పొంది తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. నేను ఉద్యోగం చేశా. వ్యాపారం చేస్తూ స్థిరపడాలన్నదే నా కోరికగా ఉండేది. అయితే, ఆర్థిక వనరులు అందుబాటులో లేక అది సాధ్యం కాలేదు. కానీ, దళితబంధు పథకం వల్ల నా కల సాకారం చేసుకున్నాను. నాకెంతో ఆనందంగా ఉంది. దళితుల జీవితాలను ఉద్ధరించేందుకు దళితబంధు పథకం తెచ్చిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
-సుదర్శన్, దళితబంధు లబ్ధిదారుడు, రుద్రారం, సంగారెడ్డి జిల్లా
మినీ సూపర్ మార్కెట్ బాగా నడుస్తున్నది
దళిత బంధు ఇచ్చిన సీఎం కేసీఆర్కు దండాలు. దళితబంధు కింద రూ.10 లక్షలు వస్తాయని కలలో కూడా అనుకోలేదు. దళితులు ఆర్థికంగా ఎదగాలని దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్ సారూ గొప్ప మనిషి. దళితులం సార్కు రుణపడి ఉంటాం. నాది చిన్నశంకరంపేట మండలం చందంపేట. నా పేరు రొడ్డ సత్యరాజ్. మాది వ్యవసాయ కుటుంబం. రెక్కాడితే డొక్కాడని మా కుటుంబంలో దళితబంధు వెలుగులు నింపుతోంది. దళితబంధు మొదటి విడతలో మా ఊరును ఎంపిక చేశారు. ఇందులో మా కుటుంబానికి దళిత బంధు పథకం కింద రూ.10 లక్షలు మంజూరయ్యాయి. నేను మినీ సూపర్ మార్కెట్ను పెట్టుకున్నా. నెలకు రూ.35వేల వరకు ఆదాయం వస్తున్నది. నా కుటుంబం సాఫీగా సాగుతున్నది. ఇప్పుడు సంతోషంగా ఉంది. దళిత బంధు పథకం ఇచ్చిన సీఎం కేసీఆర్కు అందుకు సహకరించిన ఎమ్మెలే పద్మాదేవేందర్రెడ్డి కృతజ్ఞతలు.
– రొడ్డ సత్యరాజ్, చిన్నశంకరంపేట