సిద్దిపేట, మార్చి 2: సాగునీరు రావడంతో మత్స్య సంపద పెరిగి మత్స్యకారులకు ఉపాధి పెరిగిందని, రంగనాయకసాగర్, అనంతగిరి రిజర్వాయర్లలో మత్స్యకారులు చేపలు పట్టడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో గురువారం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీసు కమిషనర్ శ్వేత, ఇరిగేషన్ ఈఈ, మత్స్యశాఖ జిల్లా అధికారి రాములు, అన్ని మండలాలకు చెందిన ప్రజాపతినిధులతో మత్స్య పురోభివృద్ధి, రిజర్వాయర్లలో చేపలు పట్టే అంశం, 58,59 జీవోలు, సుడా ప్రగతి, ఇతరత్రా జిల్లా అభివృద్ధి, పురోగతిపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. జిల్లాలో 28వేల మంది మత్స్యకారులు ఉన్నారని, వారందరికీ గుర్తింపు కార్డులను అందజేయాలని మత్స్యశాఖ అధికారిని ఆదేశించారు.
దేశంలోనే ప్రధానంగా రంగనాయకసాగర్లో చేపలను ప్రైవేటు ఏజెన్సీలకు విక్రయించి వచ్చిన సొమ్మును మత్స్యకార సొసైటీలకు పంపిణీ చేయాలని సమీక్షలో నిర్ణయించారు. రంగనాయకసాగర్లో మూడేళ్లుగా చేపలు వదలుతున్నామన్నారు. వీలైనంత తొందరగా మత్స్యకార సొసైటీ ఎన్నిక నిర్వహించాలని మత్స్యశాఖ అధికారికి మంత్రి ఆదేశించారు. 58,59 జీవోలకు సంబంధించి లబ్ధిదారులతో త్వరగా పేమెంట్స్ కట్టించి వారికి క్రమబద్ధ్దీకరణ చేసిన పట్టాల పంపిణీకి సర్వం సిద్ధం చేయాలని కలెక్టర్, రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. పట్టాలు వస్తే శాశ్వత హక్కులు వస్తాయని, దీంతో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కలిగి విక్రయించే అవకాశం ఉంటుందని మంత్రి చెప్పారు. సుడా పరిధిలో ల్యాండ్ పూలింగ్ -లేఅవుట్స్ సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో మిట్టపల్లి, పొన్నాలలో భూమి గుర్తించారు. ప్లాటింగ్ చేసి మార్చి నెలాఖరులోగా యాక్షన్లోకి వెళ్లాలని, ఇదే సుడా తరహాలో గజ్వేల్ గడాలో చేయాలని కలెక్టర్ను మంత్రి ఆదేశించారు. జిల్లాలోని హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాలలో సైతం పరిశీలనలు జరిపి చర్యలు చేపట్టాలని కలెక్టర్కు సూచించారు.