ప్రభుత్వ బడుల్లో విద్యనభ్యసించే విద్యార్థులు పస్తులుండొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సీఎం అల్పాహారం పథకం శుక్రవారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పండుగలా ప్రారంభమైంది. మొదటి రోజు ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులకు స్వయంగా టిఫిన్ వడ్డించి వారితో కలిసి తిన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, కలెక్టర్ రాజర్షిషా, శివ్వంపేటలో ఎమ్మెల్యే మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతాప్రభాకర్తో కలిసి కలెక్టర్ శరత్కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్కారు బడుల బలోపేతానికి సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారన్నారు. ‘మనఊరు-మనబడి’ ద్వారా కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో విద్యార్థుల ఆకలిబాధలు తీరాయన్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్తో శక్తి వస్తుందని, చదువుపై ఏకాగ్రత పెరగడంతో పాటు పోషకాహార సమస్య పరిష్కారమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు.
– సంగారెడ్డి/ మెదక్ న్యూస్నెట్వర్క్, అక్టోబర్ 6
సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 6: బడి పిల్లలకు సీఎం అల్పాహార పథకం వరమని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అన్నారు. ఉదయం పూట అల్పాహారంతో శారీరక సత్తువ, మానసిక ఆరోగ్యం కలుగుతుందని పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం అల్పాహార పథకం టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1277 ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు సీఎం అల్పాహార పథకం అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్లు ఉన్న అల్పాహారం అందిస్తారని వివరించారు.
ప్రతిరోజు ఉదయం పాఠశాల ప్రారంభానికి 45 నిమిషాల ముందు అల్పాహారం అందించనున్నట్లు తెలిపారు. ఉదయం అల్పాహారం విద్యార్థుల ఎదుగుదలకు ఉపయోగపడుతుందని, తరగతి గదిలో ఏకాగ్రత మెరుగవుతుందని ఆకాంక్షించారు. ప్రతిరోజు ఉదయమే పిల్లలందరూ పాఠశాలకు వచ్చి అల్పాహారం స్వీకరించాలని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పిల్లలకు నచ్చిన టిఫిన్లను అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరి తల్లిదండ్రులు, పాఠశాల, జిల్లా పేరు ప్రతిష్టలను పెంచాలని ఆకాంక్షించారు.
సీఎం ఏమి చేసినా చరిత్ర సృష్టిస్తుంది..
– రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్
సీఎం కేసీఆర్ ఏది చేసినా చరిత్ర సృష్టిస్తున్న దని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నో గుణాత్మకమైన మార్పులు తెచ్చారని, దేశంలో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపారన్నారు. విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగుపర్చడం కోసం పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో సీఎం అల్పాహార పథకం ప్రవేశ పెట్టారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు.
అనంతరం విద్యార్థులకు స్వయంగా కలెక్టర్, చింతా ప్రభాకర్ అల్పాహారం వడ్డించి, వారితో కలిసి టిఫిన్ చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో రవీందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుజాత, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, కంది ఎంపీపీ సరళ, కంది జడ్పీటీసీ కొండల్రెడ్డి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి లింబాజి, బీఆర్ఎస్ నాయకులు విజయేందర్రెడ్డి, రామప్ప, ఎంఈవో వెంకట నర్సింలు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాకీర్ హుస్సేన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మెదక్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ బ్రేక్ ఫాస్ట్ పథకం అట్టహాసంగా ప్రారంభమైంది. మెదక్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినీలకు అల్పాహారాన్ని అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ అల్పాహార పథకం విద్యార్థులకు వరమన్నారు.
సీఎం కేసీఆర్ మదిలో నుంచి పుట్టినది ఈ అల్పాహార పథకం అని తెలిపారు. దిశలవారీగా ప్రతి పాఠశాలలో ఈ పథకం ప్రారంభమవుతుందన్నారు. సీఎం అల్పాహార పథకం ద్వారా మెదక్ జిల్లాలో 897 పాఠశాలల్లో 84,554 మంది మండల పరిషత్, జిల్లా పరిషత్, ప్రభుత్వ డే సూలు విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ నిరుపేదల పక్షపాతి అని, నిరుపేదల సంక్షేమానికి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దకుతుందన్నారు. విద్యార్థులకు సంక్షేమానికి అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చదువులో రాణించాలన్నారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని, ముఖ్యంగా రైతుల కోసం ఉచిత కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్టువంటి పథకాలతో రైతుల గోసలు తీర్చారని పేరొన్నారు. మెదక్ పట్టణంలో జిల్లా కేంద్రం ఏర్పాటు, ఎస్పీ ఆఫీసు, సీసీ రోడ్ల నిర్మాణం, మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం ఇలా అనేక సంక్షేమ పథకాలతో మెదక్ పట్టణాన్ని అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు. పట్టణంలో ప్రభుత్వ పాఠశాల, మైనార్టీ సోషల్ వెల్ఫేర్ సూల్స్ రెసిడెన్షియల్ సూల్స్, అన్ని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కింద సన్న బియ్యం పెట్టి విద్యార్థుల పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల ఆనందం విద్యార్థి ఎదిగినపుడేనని, చదువు, సంసారం నేర్చుకొని భావిభారత పౌరులుగా ఎదగాలన్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పదికి పది సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తామన్నారు. విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
– మెదక్ కలెక్టర్ రాజర్షి షా
ప్రభుత్వ పాఠశాలలో ఎకువగా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుతారని, వారిలో పోషకాహార లోపాలను నివారించేందుకు సీఎం కేసీఆర్ అల్పాహార పథకం మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రభుత్వం చేపట్టిన మంచి పథకాలు దేశంలోనే లేవన్నారు. సీఎం అల్పాహార పథకం ప్రారంభించడానికి సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీతో అధ్యయనం చేయించి, ప్రారంభించారని తెలిపారు. గత అకాడమీ ప్రారంభంలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించుకున్నామని, మనఊరు-మనబడి కార్యక్రమాల బాధ్యత ప్రధానోపాధ్యాయులదేన్నారు.
అనంతరం ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, అధికారులు, ప్రతినిధులు విద్యార్ధులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. కార్యక్రమంలో డీఈవో రాధాకిషన్, ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ బట్టి జగపతి, ఎంఈవో నీలకంఠం, మార్కెటింగ్ చైర్మన్ విజయపాల్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సీడీపీవో స్వరూప, సహాయ సీడీపీవో వెంకటరమణ, వైద్య శ్రీనివాస్ శర్మ, పట్టణ కౌన్సిలర్లు ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, వంజరి జయరాజ్, బీఆర్ఎస్ నాయకులు రాగి అశోక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.