అందోల్, జనవరి 26: ఆలయాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వ పెద్దపీట వేస్తున్నదని జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. గురువారం మండలంలోని మాసాన్పల్లి మాజీ ఏఎంసీ చైర్మన్ నారాయణ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పెద్దమ్మతల్లి ఆలయ పనులను ప్రారభించి, ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వ రాష్ట్రంలో దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. ధూప, దీప నైవేద్యం పథకం తీసుకొచ్చి ఆలయాల నిర్వహణకు నిధులు అందజేయడంతో పాటు అర్చకులను ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ను ఘనంగా సన్మానించారు.
ఆలయ నిర్మాణానికి రూ.4లక్షల స్టీల్ అందజేసిన నీలం మధు
దైవ సకల్పం ఉంటే ఎంతటి పనినైనా సులభంగా చేయవచ్చని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు అన్నారు. గురువారం మాసాన్పల్లిలో నిర్మిస్తున్న పెద్దమ్మతల్లి ఆలయ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ దృఢ సంకల్పం, దేవుడి చల్లని దీవెలనతో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదన్నారు. తనవంతు సాయంగా పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి రూ.4లక్షల స్టీల్ అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు, సర్పంచ్ ప్రవీణ్రెడ్డి, నాయకులు చాపల వెంకటేశం, నాగభూషణం పాల్గొన్నారు.