నంగునూరు, జూన్ 4: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం, మరోవైపు మిల్లర్లు వేధిస్తుండటంతో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపూర్ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో విసిగిపోయిన రైతులు గురువారం తమ ధాన్యంతో నేరుగా నంగునూరు తహసిల్ కార్యాలయాన్ని ముట్టడించారు.
ఘనపూర్లో సుమారు 2500 బస్తాల ధాన్యం తూకం వేసి, కొనుగోలుకు సిద్ధంగా ఉంచినప్పటికీ అధికారులు వాటిని మిల్లులకు తరలించకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో నాలుగు రోజులుగా తూకాలు పూర్తిగా నిలిచిపోయాయని, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షానికి ధాన్యం తడిసిపోతే తాము కోలుకోలేమని రైతులు కన్నీరుమున్నీరు అయ్యారు.
తమ ధాన్యానికి రక్షణగా తహసీల్ కార్యాలయం లేదా స్థానిక గోడౌన్లలో దించుకునేందుకు అనుమతించాలని తహసీల్దార్ ప్రవీణ్రెడ్డిని కోరారు. గట్లమల్యాల గోడౌన్లలో స్థలం లేదని అధికారులు చెప్పడంతో తహసీల్ కార్యాలయానికి తీసుకొచ్చారు. స్థానిక నాయకులతో మాట్లాడి, ఘనపూర్ ట్రాక్టర్ల ధాన్యానికి గట్లమల్యాల గోడౌన్లో చోటు కల్పించడంతో వివాదం తాతాలికంగా సద్దుమణిగింది. రామునిపట్ల సాయి బాలాజీ రైస్మిల్లు యజమానులు క్వింటాలుకు 10 కిలోల తరగు పెడితేనే కొంటామని చెప్పడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని, మిల్లర్ల దోపిడీని అరికట్టాలని రైతులు డిమాండ్ చేశారు.